టిట్లీకి బాలకృష్ణ రూ.25 లక్షల విరాళం: సంతోషంగా లేను, మీ హెరిటేజ్లో వస్తాయా: పవన్ ఆగ్రహం
శ్రీకాకుళం: టిట్లీ తుఫాను బాధితులకు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. టిట్లీ తుఫాను బాధితులకు విరాళాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ పిలుపుకు స్పందించిన ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు.
చదవండి: పవన్-జగన్లతో కలిసి దిగితే చెప్పండి: సబ్బం, వారసత్వంపై జనసేనానికి దిమ్మతిరిగే కౌంటర్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్ల సంఘం కూడా ఒకరోజు విరాళం ప్రకటించింది. దీనిని త్వరలో ముఖ్యమంత్రికి అందజేస్తామని ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షులు శశిభూషణ్ తెలిపారు. ఇప్పటికే సహాయ చర్యల్లో ఐఏఎస్ అధికారులు పని చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు సంపూర్ణేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ, నిఖిల్, విజయ్ దేవరకొండ, కార్తికేయ తదితరులు విరాళం ప్రకటించారు.
నారా లోకేష్ విజ్ఞప్తి
టిట్లీ తుపానుతో ఎంతో నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు అందరూ అండగా నిలవాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. నష్టం అంచనా వేయడానికి, బాధాతప్త హృదయాల్లో భరోసా కల్పించి ఆదుకోవడానికి ప్రభుత్వం నిర్విరామంగా పని చేస్తోందని అన్నారు. విరాళాలు ఇచ్చేవారు ముఖ్యమంత్రి సహాయనిధికి పంపాలని కోరారు.
పండుగ శుభాకాంక్షలు, నేను సంతోషంగా లేను
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులకు, జనసైనికులకు పండుగ శుభాకాంక్షలు అని, కానీ తాను పండుగ తరుణంలో సంతోషంగా లేనని, తుఫానుకు చిన్నాభిన్నమైన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్నానని పేర్కొన్నారు. అంతకుముందు, టిట్లీ తుఫాను బాధితులను బుధవారం పరామర్శించిన విషయం తెలిసిందే.
అప్పుడే పండుగ రోజు
ఈ ప్రాంత ప్రజలు సాధారణ జన జీవనంలోకి వచ్చినప్పుడే మనకి పండుగ రోజు అని, ఆ జగన్మాత మనందరిపై కృప చూపాలని వేడుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. తుఫాన్ బాధితులకు జనసేన అండగా ఉంటుందని చెప్పారు. పవన్ బాధితులను కలిసి నష్టాన్ని తెలుసుకున్నారు.
చంద్రబాబూ! రూ.500కు మీ హెరిటేజ్లో వస్తాయా?
ఊళ్లకు ఊళ్ళు నిర్జీవంగా మారిపోయాయని, వందల ఏళ్లనాటి వృక్షాలు నేలకొరిగాయని, ప్రజలందరూ బరువెక్కిన గుండెలతో ఉన్నారని, అర్ధాకలితో అలమటిస్తున్నారని, గుక్కెడు నీళ్లులేక విలవిలలాడి పోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. టిట్లీ తుఫానులో సర్వస్వం కోల్పోయిన గ్రామంలోని 30 కుటుంబాలకు కలిపి కేవలం రూ.500 కూరగాయలు ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చారని, మీ హెరిటేజ్ సూపర్ మార్కెట్లో రూ.500కు 30 కుటుంబాలకు సరిపడా కూరగాయలు ఇస్తారా, ఉత్తరాంధ్ర ప్రజలు అంటే ఇంత చిన్నచూపా అని మండిపడ్డారు.