జగన్పై బాలకృష్ణ పరోక్ష వ్యాఖ్యలు, 'బాబును కాదు, పారడైజ్పై సవాల్ చెయ్,'
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా విమర్శలు చేయడంపై టీడీపీ నేతలు స్పందిస్తున్నారు.
విశాఖపట్నం/అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా విమర్శలు చేయడంపై టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
15రోజుల టైమిస్తున్నా, రాజకీయాలు వదిలేస్తా: పారడైజ్పై బాబుకు జగన్ దమ్మున్న సవాల్, బీజేపీతో పొత్తుపై
అవగాహన లేకుండా మాట్లాడటమా?
చంద్రబాబు అపరభగీరథుడు అని, ఆయనపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పరోక్షంగా జగన్ను ఉద్దేశించి అన్నారు. విశాఖ నగర రూపురేఖలు మార్చేందుకు ఆయన అంకితభావం, నిజాయితీతో కృషి చేస్తున్నారని చెప్పారు.
హుదుద్ వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు
హుదుద్ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు విశాఖలోనే ఉండి పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నారని బాలకృష్ణ అన్నారు. చెన్నై - విశాఖ కారిడార్ విస్తరణకు శ్రీకారం చుట్టారని కితాబిచ్చారు.
థింసా నృత్యం చేసిన బాలకృష్ణ
కాగా, బాలకృష్ణ బుధవారం విశాఖలో తెలుగు యువత కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన వస్తున్నారని తెలిసి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సినిమా షూటింగులో ఉన్న బాలకృష్ణ గంట ఆలస్యంగా వచ్చారు. బాలయ్య గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు.
అవినీతి మూలాలు జగన్ వద్ద
అసెంబ్లీకి వస్తే ప్రభుత్వాన్ని తప్పుబట్టే అవకాశం లేకనే జగన్ సమావేశాలకు రావడం లేదని మంత్రి గంటా శ్రీనివాస రావు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు చేజారిపోతారని సభకు రావడం లేదన్నారు. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా దాని మూలాలు జగన్ వద్ద వెలుగు చూస్తున్నాయన్నారు.
పారడైజ్పై సవాల్ చెయ్యి
పారడైజ్ పేపర్లపై జగన్ సవాల్ పైనా గంటా స్పందించారు. సవాల్ చేయాల్సింది చంద్రబాబు కాదని, నిజాయితీ ఉంటే పారడైజ్ పేపర్ల మీద, సీబీఐ మీద, వికీలీక్స్ మీద సవాల్ చేయాలని విమర్శించారు. పారడైజ్ పేపర్ల అంశం దేశవ్యాప్తంగా మీడియాలో వచ్చాయన్నారు. 2019లోపు జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని, రాబోయే రోజుల్లో జగన్ పార్టీ ఉంటుందో లేదో తెలియదన్నారు. అక్రమాస్తులు లేకుంటే శుక్రవారం పాదయాత్రకు విరామం ఇచ్చి కోర్టుకు ఎందుకు అని నిలదీశారు.