ఛలో ఆత్మకూరు లో బాలయ్య రోల్ లేదే !!... పార్టీ శ్రేణుల్లో బాలయ్య తీరుపై అసహనం
Recommended Video
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టిడిపి కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టారు. ఇక ఆత్మకూరులో 70 మంది టీడీపీ కార్యకర్తలపై వైసిపి వర్గీయులు అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై తలపెట్టినటువంటి ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.కానీ బాలయ్య మాత్రం తనకేమీ సంబంధం లేనట్టు మిన్నకున్నారు.
ఛలో పల్నాడు భగ్నం .. అధికార పార్టీపై నిరసన గళం వినిపించేందుకు టీడీపీ ప్రయత్నం
ఛలో పల్నాడు నేపధ్యంలో ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వైసిపి ప్రభుత్వం ఛలో పల్నాడులో భాగంగా నిర్వహిస్తున్న ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేసింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలకంగా భావించిన నేతలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని ప్రయత్నం చేశారు. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. గృహనిర్బంధం లతోనూ, అరెస్టులతో నూ రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఛలో పల్నాడుకు దూరంగా ఉన్న హిందూపూర్ ఎమ్మెల్యే సినీనటుడు బాలకృష్ణ
టీడీపీ పార్టీ నేతలందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం చలో పల్నాడు కార్యక్రమం విషయంలో ఎలాంటి రోల్ తీసుకోలేదు .ఈ కార్యక్రమానికి సైతం ఆయన హాజరు కాలేదు, కనీసం ఈ కార్యక్రమం కోసం కనీసం తన స్పందనను కూడా తెలియ చేయకపోవడం పార్టీ శ్రేణులను ఇబ్బంది పెడుతోంది. అధికార పార్టీలో ఉన్నప్పుడు పెద్దగా పట్టింపు లేనట్లుగా వ్యవహరించినా పర్వాలేదు కానీ ప్రతిపక్ష పార్టీ నేతగా, హిందూపూర్ ఎమ్మెల్యే గా టిడిపి కార్యకర్తలు పై చేస్తున్న దాడులపై స్పందించాల్సిన అవసరం బాలకృష్ణ కు ఎంతైనా ఉంది.
ప్రతిపక్షంలో ఉన్నా మారని బాలయ్య వైఖరి .. పార్టీ శ్రేణులలో అసహనం
బాలకృష్ణ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ స్పందించకపోవడం పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు తెలుగు జాతి అభిమానం కోసం పెట్టిన పార్టీ ఆయన టిడిపిని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఆయన తనయుడిగా బాలకృష్ణ పై ఉంది. అందులోనూ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి పై అవినీతి ఆరోపణలు చేస్తూ, అడుగడుగున ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత బాలయ్యకు ఉంది. కానీ బాలకృష్ణ ఇలాంటి సమయంలో కూడా సినిమాలలో బిజీ అయ్యారు.
కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉన్నా సీరియస్ గా పాలిటిక్స్ పై దృష్టి పెట్టని బాలయ్య
ఇటు ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గంలో కూడా చేస్తున్న పెద్ద కార్యక్రమాలు కూడా లేవు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా పార్టీని పటిష్టం చేయాల్సిన సమయంలో కూడా బాలకృష్ణ తనకేమీ సంబంధం లేనట్టు ప్రవర్తించడం అటు చంద్రబాబుకి సైతం ఒకింత ఇబ్బందికరంగా మారిన అంశమే. కుటుంబం మొత్తం రాజకీయాలలోనే కొనసాగుతున్నా , ఒకపక్క ఇద్దరు అల్లుళ్ళు నారా లోకేష్, శ్రీ భరత్ లు పార్టీ కోసం తమ గళాన్ని వినిపిస్తున్నా, బాలకృష్ణ పార్టీ శ్రేణులకు మద్దతుగా తమ గళాన్ని వినిపించకపోవడం పార్టీకి ఒకింత నిరాశ కలిగిస్తుంది. ఇక ఈ సమయంలోనైనా బాలయ్య రంగంలోకి దిగి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పరచాల్సిన అవసరం, తాను అండగా ఉన్నానని చెప్పాల్సిన బాధ్యత ఉంది అని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.
బాలయ్య పంధా మారాలని ,బాబుకు అండగా నిలవాలని తెలుగు తమ్ముళ్ళ ఆకాంక్ష
చంద్రబాబు తలపెట్టిన ఛలో పల్నాడు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. కానీ చంద్రబాబు మాత్రం ఛలో పల్నాడు నిర్వహించి తీరుతామని చాలా ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ ఆందోళనలతో, హౌస్ అరెస్టులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రం ఒక్కసారిగా అట్టుడికింది. చంద్రబాబు తలపెట్టిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేసినా ఛలో పల్నాడు దేశవ్యాప్త చర్చకు కారణమైంది. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీతో ప్రతిపక్ష పార్టీ యుద్ధం చేస్తున్న సమయంలో కీలకనేతగా భావించే బాలకృష్ణ యుద్ధ క్షేత్రంలో పోరాటం చేయకపోవడం తెలుగు తమ్ముళ్లకు రుచించలేదు. భవిష్యత్తులో అయినా బాలయ్య తన పంథా మార్చుకుని పార్టీ కార్యక్రమాల్లో కీలక భూమిక పోషించాలని ఆశిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.