హిందూపురంలో బాలకృష్ణ సందడి, చైనాలో పెట్టుబడుల కోసం బాబు
హిందూపురం: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం నాడు తన నియోజకవర్గంలో పర్యటించారు. తూముకుంటడ చెక్ పోస్టు వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్కు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. పేదల కోసం ఆ రోజుల్లోనే రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారన్నారు. రాయలసీమ భవిష్యత్ అవసరాల కోసం హంద్రీనీవాను ప్రారంభించిన అపర భగీరథుడన్నారు. హంద్రీనీవాను త్వరలోనే పూర్తిచేసి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.
క్రాప్ హాలీడే వద్దు: చినరాజప్ప
రైతులు క్రాప్ హాలీడే ప్రకటించవద్దని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కులాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
చైనా పర్యటనలో చంద్రబాబు బిజీ
చైనా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు జెట్రో ప్రెసిడెంట్ యసూషి అకహోషితో సమావేశమమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జెట్రోతో ఆంధ్రప్రదేశ్కు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, గతేడాది 10.99శాతం వృద్ధి సాధించిందన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15శాతం వృద్ధి రేటు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అన్ని అనుమతులను వేగంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీలో మంచి వాణిజ్య అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా ఉత్పత్తి రంగానికి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేశామన్నారు.