బరువైన హృదయం.. భారమైన సమయంలో.. కోడెల పార్థీవదేహంతో అంతిమయాత్ర వాహనంలో బాలయ్య..
అమరావతి/ నరసారావుపేట : కోడెల శివప్రసాద్ అంతిమయాత్రలో వేలాది మంది జనం పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంత జనం కోడెలకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. తమతో కోడెలకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. నియోజకవర్గం కోసం ఎంతో చేశారని కీర్తిస్తున్నారు. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఉబికివస్తోన్న కన్నీరును ఆపుకొని అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. టీడీపీ శ్రేణులు వెంటరాగా ... భారమైన హృదయంతో కోడెల శివప్రసాద్ అంతిమయాత్ర కొనసాగుతుంది.
కోడెల అంతిమయాత్రలో బాలయ్య
కోడెల శివప్రసాద్ అంతిమయాత్రలో ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణ పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంతిమయాత్ర వాహనం ముందు కదలిరాగా .. మిగిలిన నేతలు, టీడీపీ శ్రేణులు, నరసారావుపేట స్థానికులు బరువెక్కిన హృదయంతో కదలి వస్తున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం కోడెల శివప్రసాద్ పార్థీవదేహం ఉన్న వాహనంలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కోడెల శివప్రసాద్తో తనకు ఉన్న అనుబంధం ప్రత్యేకమని బాలయ్య చాటి చెప్పారు. రాజకీయంగానే గాక వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. ముఖ్యంగా బసవతారం ఆస్పత్రి ఏర్పాటు చేశాక కోడెల శివప్రసాద్ పాత్ర మరవలేనిది. తొలుత ఆయనే చైర్మన్గా విధులు నిర్వర్తించారు.
క్యాన్సర్ ఆస్పత్రిలో సేవలు ..
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో పేదలకు వైద్య సేవలు అందిస్తూ మన్ననలు పొందారు. తక్కువ ధరకే ఇతరులకు వైద్యం అందించి మంచిపేరు తీసుకొచ్చారు. కోడెల శివప్రసాద్ చైర్మన్గా ఉన్నప్పుడే క్యాన్సర్ ఆస్పత్రి పేరు మారుమోగింది. ఆస్పత్రిలో రోగులకు కూడా మెరుగైన వైద్యం అందింది. ఆ తర్వాత బసవతారకం ఆస్పత్రి చైర్మన్ బాధ్యతలను బాలకృష్ణ నిర్వహిస్తున్నారు. తన తల్లి పేరుతో ఏర్పాటుచేసిన ఆస్పత్రికి మంచి పేరు తీసుకొచ్చింది .. కోడెల అని బాలయ్యకు తెలుసు. ఆయన చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని గుర్తించి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది.
ప్రత్యేక అభిమానం ..
అప్పటినుంచి కోడెల శివప్రసాద్ అంటే బాలయ్యకు ప్రత్యేక అభిమానం. ప్రతి సందర్భంలో కలిసి మంచి చెడు తెలుసుకునేవారు. కానీ ఇటీవల అతను బలవన్మరణానికి పాల్పడటంతో జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఉరేసుకొన్నాక .. బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిసి జీర్ణించుకోలేకపోయారు. ఆస్పత్రి చైర్మన్గా పనిచేసి మంచి పేరు తీసుకొచ్చారని .. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నిర్జీవంగా పడి ఉన్నారని తెలిసి జీర్ణించుకోలేకపోయారు బాలయ్య. ఆయన చనిపోయారని తెలిసినప్పటి నుంచి మదనపడుతూనే ఉన్నారు. ఇవాళ నరసారావుపేటలో జరుగుతున్న అంతిమయాత్ర వాహనంలో ఉండి .. తన హితునికి కన్నీటి నివాళులు అందిస్తున్నారు.