చంద్రబాబులాగే..: వైయస్ జగన్కు హీరో బాలకృష్ణ పరోక్ష చురకలు
అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన బావ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులాగే ప్రతిపక్షాల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాదారణంగా ఆయన ప్రతిపక్షాల పైన విమర్శలు చేయడం అరుదు.
తాజాగా, ఆయన ఆదివారం నాడు దీపావళి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. నరకాసురున్ని వధించిన శ్రీకృష్ణుడు సర్వమానవాళికి మేలు చేశాడని చెప్పారు. అయితే పురాణాల్లో నాటి పరిస్థితులే నేటికి ఉన్నాయన్నారు.
అలాగే, రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా అలాగే మారాయని పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి అన్నారు. ప్రతి అభివృద్ధికి అడ్డు పడటమే పనిగా పెట్టుకున్నారని, తద్వారా నరకాసురునితో సమానంగా విపక్షాలు మారిపోయాయని ఎద్దేవా చేశారు. అలాంటి శక్తులను దూరం పెట్టాలన్నారు.
కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అభివృద్ధి పనులకు ప్రతిపక్షాలు అడ్డు పడుతున్నాయని మొదటి నుంచి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఇటీవల మాట్లాడారు.
కులాలు, ప్రాంతాల పేరుతో రొచ్చగొట్టే నరకాసురులు ఉన్నారని, అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అభివృద్ధికి అడ్డం పడే ప్రతిపక్షాల విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.