బిజెపితో పొత్తుపై బాలకృష్ణ, జగన్పార్టీలో చేరిన దినేష్రెడ్డి
నల్గొండ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తుపై హీరో నందమూరి బాలకృష్ణ సోమవారం స్పందించారు. లెజెండ్ విజయవంతమైన నేపథ్యంలో ఆయన సినిమా యూనిట్తో కలిసి రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సమయంలో ఆయన పొత్తు, అసంతృప్తులపై స్పందించారు. పొత్తులో భాగంగా పార్టీలో నష్టపోయిన వారికి తగిన న్యాయం జరుగుతుందన్నారు. బిజెపితో పొత్తు నేపథ్యంలో ఎన్నో అంశాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుందన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.
తమ పార్టీ అధ్యక్షులు, తన బావ నారా చంద్రబాబు నాయుడు ఎక్కడి నుండి పోటీ చేయమంటే తాను అక్కడి నుండ-ి పోటీకి సిద్ధమని బాలయ్య చెప్పారు. ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ఆయన అన్నారు.
జగన్ పార్టీలోకి దినేష్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ డిజిపి దినేష్ రెడ్డి సోమవారం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రానికి వైయస్ చేసిన సేవలను చూసి ముగ్ధుడనయ్యానన్నారు. ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో జగన్ పార్టీలో చేరానని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం జగన్కే సాధ్యమన్నారు. పార్టీ ఆదేశాల మేరకు తాను పోటీ చేస్తానన్నారు.