పీఏ శేఖర్ గొడవ: హిందూపురం రగడపై బాలకృష్ణ గట్టి వార్నింగ్
అనంతపురం జిల్లాలోని తన నియోజకవర్గం హిందూపురంలో గ్రూపు రాజకీయాల పైన ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ సోమవారం నాడు స్పందించారు. ఆయన నిమ్మకూరులో పర్యటించారు.
హిందూపురం: అనంతపురం జిల్లాలోని తన నియోజకవర్గం హిందూపురంలో గ్రూపు రాజకీయాల పైన ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ సోమవారం నాడు స్పందించారు. ఆయన నిమ్మకూరులో పర్యటించారు.
ఈ సందర్భంగా విలేకరులు గ్రూపు గొడవల గురించి అడిగారు. హిందూపురంలో గ్రూపులను ప్రోత్సహించేది లేదని చెప్పారు. గ్రూపులు కట్టినా, అవినీతికి పాల్పడినా ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకునేది లేదని, చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
బాలకృష్ణ పీఏ హౌస్ అరెస్ట్: బాలయ్యకు సొంత నేతల అల్టిమేటం, చిక్కుల్లో టిడిపి
కాగా, బాలకృష్ణ పీఏ శేఖర్ లంచగొండి అని, ఆయన వెళ్లిపోవడానికి వారం రోజులు గడువు ఇస్తున్నామని ఆలోగా వెళ్లిపోకపోతే హిందూపురం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాహారదీక్షకు దిగుతామని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు అల్టిమేటం జారీ చేశారు.
శేఖర్ను సాగనంపాలనే డిమాండుతో ఆదివారం చిలమత్తూరులో నిర్వహించతలపెట్టిన సమావేశం నిబంధనలకు విరుద్ధమంటూ పోలీసులు భారీ స్థాయిలో చేరుకున్నారు. కర్ణాటకలోని సుంకలమ్మ గుడి, బాబురెడ్డి ఎస్టేట్కు దాన్ని మార్చారు.
అక్కడ మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, టీడీపీ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పెద్దఎత్తున కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ వెంకటరాముడు మాట్లాడారు.
అవినీతి శేఖర్కు వారం గడువు ఇస్తున్నామని, బాలకృష్ణపై గానీ, పార్టీపై గానీ, నారావారి కుటుంబంపై గానీ ఏమాత్రం అభిమానం ఉన్నా మూటముల్లె సర్దుకుని వెళ్లిపోవాలన్నారు. బాలకృష్ణను బ్లాక్మెయిల్ చేస్తే ఊరుకునేది లేదన్నారు.
బాలయ్యకు డెడ్ లైన్: 'పీఏ వైపో?.. కార్యకర్తల వైపో?.. తేల్చుకో'
తామంతా ఆయన వెంటే ఉన్నామని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామని, అయితే శేఖర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లిపోవాలన్నారు. అవినీతి పీఏకి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తుంటే ఆంధ్ర, కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారని, ఇందుకు పెద్దఎత్తున పోలీసులు రావడం ఏమిటని నిలదీశారు.
శేఖర్ను పంపితేనే కంచుకోటలో టీడీపీ బతుకుతుందని అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. తాము చిలమత్తూరులో సభ నిర్వహిస్తామని, అడ్డుకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
అయినా పోలీసులు అడ్డుకున్నారని, అయితే నందమూరి బాలకృష్ణ పైన, పార్టీ పైన ఉన్న గౌరవంతో తమ నిర్ణయం వారం రోజులుగా వాయిదా వేసుకున్నామని చెప్పారు. ఈలోగా ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయం తీసుకుంటే కార్యకర్తలతో కలిసి తామంతా పాల్గొంటామని, చంద్రబాబు పాలనకు సహకరిస్తూ అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కార్యకర్తల బాధను అర్థం చేసుకుని శేఖర్ను సాగనంపాలన్నారు.