అందుకే రంగంలోకి పరిటాల రవి, ఆటకట్టించారు: బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్, ఏం చేశారని వైసీపీ
అనంతపురం: ఆనాడు పెనుగొండ ప్రాంతంలో అరాచక శక్తులు రాజ్యం ఏలుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ దివంగత పరిటాల రవీంద్రను రంగంలోకి దింపి, అందరి ఆట కట్టించిందని ప్రముఖ నటుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
మా పాపకు పునర్జన్మ, పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం కావాలి: శ్రీజ, తండ్రి ప్రత్యేక పూజలు
పెనుగొండలోని మడకశిర కూడలి వద్ద ఏర్పాటుచేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆనాడు అరాచక శక్తులకు అడ్డాగా ఉన్న పెనుగొండలో నేడు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు.
చంద్రబాబుపై ప్రశంసలు
పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నేను ఆవిష్కరించడం తన పూర్వజన్మ సుకృతం అని బాలకృష్ణ అన్నారు. రాయలసీమలో పలు పరిశ్రమలు నెలకొల్పడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని కితాబిచ్చారు.
హిందూపురంలో బాలకృష్ణ
బుధవారం కూడా బాలకృష్ణ అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆయన హిందూపురం శివారులో ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ సమయంలో మాట్లాడారు. 11 వేల ఇళ్లు జి+3 పద్ధతిలో నిర్మిస్తారని, మొదటి విడతలో రూ.160.51 కోట్లతో 2750 ఇళ్లు పూర్తిచేసి పేదలకు అందిస్తామన్నారు.
ఎన్టీఆర్ బాటలో సేవచేసే అవకాశం
ఎన్టీఆర్ బాటలోనే హిందూపురం పట్టణవాసులకు సేవచేసే భాగ్యం దక్కడం అదృష్టమని బాలకృష్ణ అన్నారు. నాడు ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే తన తదుపరి లక్ష్యమని చెప్పారు.
టీడీపీకీ అనంత వెంకట్రామిరెడ్డి ప్రశ్న
మరోవైపు, టీడీపీని ఆదరించిన అనంతపురం ప్రజలకు ఏం చేశారో చెప్పాలని మాజీ ఎంపీ, వైసీపీ నేత అనంత వెంకట్రామి రెడ్డి ప్రశ్నించారు. అనంత ప్రజలు 12 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను గెలిపించారని, మరి ఈ మూడున్నరేళ్లలో జిల్లాలో ఏం అభివృద్ధి చేశారని, ఎన్ని ఉపాధి అవకాశాలు చూపారని ప్రశ్నించారు. దీనిపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.
హెరిటేజ్ కోసం
రాష్ట్రంలో ఇప్పటికే 987 పరిశ్రమలు వచ్చాయని చంద్రబాబు ప్రకటించారనీ, అనంతపురంకు ఎన్ని వచ్చాయో చెప్పాలని అనంత వెంకట్రామి రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో వృద్ధి రేటు 5.7 ఉంటే రాష్ట్రంలో 11.7 శాతం ఎలా వచ్చిందో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ కంపెనీ మనుగడ కోసం పాడి పరిశ్రమను నీరుగార్చారన్నారు.