వైసీపీలోకి బాలకృష్ణ సన్నిహితుడు: నేడే జగన్ సమక్షంలో : ప్రకాశంలో టీడీపీకి షాక్..!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైసీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రహమాన్..డొక్కా చేరగా..కడప జిల్లాకు చెందిన కొందరు నేతలు నేడో రేపో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇక, తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత..మాజీ ఎమ్మెల్యే..బాలకృష్ణ సన్నిహితుడు కదిరి బాబురావు తెలుగు దేశం వీడి, వైసీపీలో చేరనున్నారు. కొద్ది రోజులుగా కదిరి బాబూరావు టీడీపీ వీడుతారనే వార్తలు వస్తున్నా.. బాలకృష్ణ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా.. నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి చూసిన తరువాత..ఆయన టీడీపీ వీడాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని బాలకృష్ణ కు సైతం చెప్పారని..ఆ తరువాతనే సీఎం జగన్ సమక్షంలో బాబూరావు చేరికకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది.
వైసీపీలోకి బాలకృష్ణ సన్నిహితుడు..
ప్రకాశం జిల్లా టీడీపీ నేత వైసీపీలో చేరుతున్నారు. అందు కోసం ముహూర్తం సైతం ఖరారైంది. టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు..సినీ హీరో బాలకృష్ణ కు అత్యంత సన్నిహితుడు అయిన కదిరి బాబూ రావు 2014 ఎన్నికల్లో కనిగిరి నుండి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో సైతం ఆయనకు టీడీపీ టిక్కెట్ దక్కినా..నామినేషన్ లో సాంకేతిక సమస్యల కారణంగా అది తిరస్కరణకు గురైంది. సమయం మించి పోవటంతో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే, తిరిగి బాలకృష్ణ సిఫార్సుతో 2014 ఎన్నికల్లో కనిగిరి నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి మధుసూధనరావు పైన 7207 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
2019లో సొంత నియోజకవర్గం నుంచి కాకుండా...
ఇక, 2019 ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కనిగిరి నుండే తిరిగి అవకాశం ఇవ్వాలని మొర పెట్టుకున్నా..పార్టీ అధినేత చంద్రబాబు కనిగిరి సీటును మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహా రెడ్డికి కేటాయించారు. బాబూరావును దర్శి నుండి బరిలోకి దింపారు. అప్పుడు కూడా బాలకృష్ణ చెప్పటంతో కాదనలేక బాబూరావు పోటీకి దిగారు. అయితే, ఆయన ఓడిపోయారు. దీంతో..అప్పటి నుండి ఆయన పార్టీలో కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
బాలకృష్ణ ఆమోదంతోనే వైసీపీలోకి..
టీడీపీ నేత కదిరి బాబూరావు తనకు రాజకీయాల కంటే బాలకృష్ణ తో సంబంధాలు ముఖ్యమని గతంలోనే స్పష్టం చేసారు. అయితే, 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుండి బాబూరావు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. దాదాపుగా జిల్లా వైసీపీ నేతలతో పాటుగా పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్యులతోనూ మంతనాలు సాగాయి. అప్పట్లోనే వైసీపీలో చేరుతున్నారంటూ ప్రచారం సాగింది. అయితే, ఇప్పుడు బాబూరావు పదే పదే కోరటంతో బాలకృష్ణ సైతం ఆయన ఇష్టం మేరకు నిర్ణయం తీసుకొనేందుకు సుముఖత వ్యక్తం చేయటంతో వైసీపీ కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు
Recommended Video
ఇప్పుడు చేరితేనే గుర్తింపు
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే వైసీపీలో చేరితే..తగిన గుర్తింపు ఉంటుందని..ఇది సరైన సమయంగా బాబూరావు భావించారు. ప్రకాశం జిల్లా నుండి కాపు వర్గానికి చెందిన బూబూరావు ను వైసీపీలో చేర్చుకుంటే పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తుంది. దీంతో..ఈ మధ్నాహ్నం ముఖ్యమంత్రి సమక్షంలో కదిరి బాబూరావు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరనున్నారు.