కాంగ్రెస్ మీద ఈగ వాలనివ్వని మహా నాయకుడు
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. కాంగ్రెస్ పై ఉన్న ధ్వేష భావం, వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ పునాదులు. తెలుగు వారిని కించపరిచిన కాంగ్రెస్ ను మట్టి కరిపించాలనే ఏకైక లక్ష్యంతో ఆవిర్భవించిన పార్టీ అది. తెలుగువారి ఆత్మగౌరవం నినాదం టీడీపీ ఊపిరి. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని తెలుగు వారిని కించ పరచడాన్ని సహించలేక, తెలుగు రాష్ట్రాన్ని శాసించడాన్ని భరించలేక ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానానికి బానిసలుగా మారిపోయారని, ఢిల్లీ పెద్దలకు వంగివంగి దండాలు పెడుతున్నారని విమర్శిస్తూ, ఎన్టీఆర్ చైతన్యరథంపై ప్రతి జిల్లాలో తిరిగారు. ప్రతి గ్రామాన్నీ సందర్శించారు.
దశాబ్దాల పాటు పరిపాలన సాగించిన అప్పటి ముఖ్యమంత్రులు కూడా వెళ్లని మారుమూల పల్లెల్లో తిరిగారు ఎన్టీఆర్. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రాగలిగారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత, తెలుగువారి పట్ల లెక్క లేని తనాన్ని చూపుతోన్న కాంగ్రెస్ ను ఎండగట్టగలిగారు. సినిమా వాళ్లకు రాజకీయం గురించి ఏమి తెలుసు అని తేలిగ్గా తీసుకున్న ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి తెలుగువారి పౌరుషం ఎలా ఉంటుందో రుచి చూపించారు. కేంద్రం అనేది ఓ మిథ్యగా చెబుతూ వచ్చారు. స్వయం సాధికారత సాధించేలా చర్యలు తీసుకున్నారు. ఏనాడూ కాంగ్రెస్ ముందు తల వంచలేదు. కాంగ్రెస్ తో యుద్ధం చేశారాయన. ఎన్టీ రామారావు రాజకీయ జీవితంలో విలన్ కాంగ్రెస్సే తప్ప మరొకరు కాదు.
విలన్ కాంగ్రెస్ కాదు నాదెండ్ల
అలాంటి ఎన్టీ రామారావు బయోపిక్ గా చెప్పుకొంటున్న `మహా నాయకుడు` సినిమాలో కాంగ్రెస్ ప్రస్తావనే లేదు. అసలు కాంగ్రెస్ అనే పదమే ఎక్కడా వినిపించదు. సినిమా మొత్తం మీద ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావనే రాదు. దీన్ని బట్టి మహా నాయకుడు మూవీ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా మొత్తం మీద నాదెండ్ల భాస్కర్ రావును విలన్ గా చూపారు. ఎన్టీ రామారావు ఎలా పదవీచ్యుతుడయ్యారనే కోణాన్ని, వైస్రాయ్ ఉదంతాన్ని, లక్ష్మీ పార్వతి ఘట్టాన్ని అస్సలు స్పృశించ లేదు. నాదెండ్ల భాస్కర్ రావును అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ అధిష్ఠానం ఆడిన నాటకాన్ని ప్రస్తావించలేదు.
కాంగ్రెస్ తప్పేమీ లేదా?
నిజానికి- నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ ను నడిపించిందే కాంగ్రెస్ పార్టీ. నాదెండ్లను అడ్డు పెట్టుకుని ఎన్టీ రామారావును గద్దె దించిందే కాంగ్రెస్. పక్కలో బల్లెంలా మారిన ఎన్టీ రామారావును పదవి నుంచి తప్పించడానికి నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిని చేసే విషయాన్ని మహా నాయకుడులో చూపించినప్పటికీ.. దాని వెనుక ఉన్న కాంగ్రెస్ పెద్దలను మాత్రం నామమాత్రంగానే ప్రస్తావించారు. గవర్నర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని తనకు నచ్చని ప్రభుత్వాలను అస్థిర పర్చే కుట్రల్లో భాగంగా కాంగ్రెస్, అప్పటి గవర్నర్ రామ్ లాల్ ద్వారా నాదెండ్లను ముఖ్యమంత్రిని చేస్తుంది కాంగ్రెస్. దీనికి సంబంధించిన సన్నివేశాల్లో కూడా ఎక్కడా కాంగ్రెస్ అనే పదం వినిపించలేదు. ఈ వ్యవహారం మొత్తంలో తప్పంతా నాదెండ్లదే అన్నట్టుగా చూపారు. ఆయనను నడిపించిన కాంగ్రెస్ పెద్దలకు వ్యతిరేకంగా ఒక్క డైలాగ్ కూడా పడకుండా చూసుకున్నారు. కాంగ్రెస్ మీద ఈగ వాలనివ్వకుండా జాగ్రత్తపడ్డారు.
హీరోగా చంద్రబాబు ఎలివేట్
పైగా నాదెండ్ల ఎపిసోడ్ ను అడ్డుగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు పాత్రను బాగా ఎలివేట్ చేశారు. చంద్రబాబే లేకపోయి ఉంటే ఎన్టీ రామారావు ఏమైపోయే వారో అనేలా చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ తరం యువతకు, కొత్తగా ఓటు వేయబోయే వారికి `మహా నాయకుడు` చూపించాలని స్వయంగా చంద్రబాబే పబ్లిసిటీ ఇచ్చుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం, అసలు ఉద్దేశం ఇదే. చంద్రబాబుకు అనుకూలంగా, నొప్పి కలిగించకుండా చరిత్రను కూడా వక్రీకరించేలా సినిమాను తెరకెక్కించారనడంలో సందేహాలు అక్కర్లేదు. మహా నాయకుడులో కాంగ్రెస్ ప్రస్తావన లేకపోవడానికి ప్రధాన కారణం మనకు తెలిసిన వ్యవహారమే. కాంగ్రెస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది ఇప్పటి తెలుగుదేశం పార్టీ అని అభిమానులు విమర్శిస్తున్నారు. అవకాశ వాద రాజకీయానికి కేంద్రబిందువైందని ఆక్రోశిస్తున్నారు.
చంద్రబాబు మంచి కథకుడే..
చంద్రబాబు నాయుడు రాజకీయ వేత్త మాత్రమే కాదని, ఆయనలో ఓ మంచి కథకుడు కూడా ఉన్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు అభిమానులు. ఓ మాంచి పొలిటికల్ థ్రిల్లర్ సినిమాకు కథను అందించేంత మెటీరియల్ చంద్రబాబులో ఉందంటూ చురకలు అంటిస్తున్నారు సినిమా చూసిన వారు. మహా నాయకుడు సినిమాలో కాంగ్రెస్ ను విమర్శిస్తూ ఒక్క మాట కూడా లేకపోవడం, నాదెండ్లను విలన్ గా చూపడం, ఓ సన్నివేశంలో ఇందిరాగాంధీ పాత్ర ధారిణి ఎన్టీ రామారావు కృష్ణుడి వేషంలో ఉన్న కటౌట్ ను చూసి మొక్కడం వంటి సన్నివేశాలను చంద్రబాబే సూచించారనే అభిప్రాయం ఉంది. సినిమా చిత్రీకరణలో ఉన్న సమయంలో దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణ ఓ సారి చంద్రబాబును కలిశారు. చంద్రబాబు చేసిన సూచనల మేరకే కథలో మార్పులు చేశారనే టాక్ ఉంది.