బాబు సమర్థుడే కానీ ఆ బలం కావాలి, అసాధ్యాలు సుసాధ్యం: బాలకృష్ణ
విశాఖ: తరుచూ యజ్ఞయాగాదాలు చేయడం వల్ల అసాధ్యమనుకున్నవి సుసాధ్యమవుతాయని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. విశాఖలోని శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఆదివారం పీఠం వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఆయన సుబ్రహ్మణ్య స్వామి మహాకుంభాభిషేకం యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తాను యాగంలో పాల్గొని ప్రత్యేక పజలు చేసినట్లు చెప్పారు. యాగం ఓ యోగం అన్నారు.
యాగ నిర్వహణతో పంచభూతాలు ఆధీనంలో ఉంటాయని చెప్పారు. పూర్వాకాలంలో వర్షాల కోసం యాగాలు నిర్వహించేవారని, దీంతో పంటలు బాగా పండి, ప్రజలు సుభిక్షంగా ఉండేవారని చెప్పారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపే సమర్థమైన నాయకుడు ఉన్నారని చంద్రబాబును ఉద్దేశించి చెప్పారు.
అయినప్పటికీ దైవబలం తప్పనిసరి అని, అందుకే యాగాల నిర్వహణతో భగవంతుడి కృప లభిస్తుందని చెప్పారు. ఈ ఏడాది గ్రహదోశాల అరిష్టాలను స్వరూపనంద ముందుగానే గుర్తించారని, వాటి నివారణ కోసం యజ్ఞయాగాదులను నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా యాగాలను నమ్ముతారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన పలుమార్లు యాగాలు చేశారు. తెలంగాణ సాధించాక ఇటీవల శతచండీయాగం నిర్వహించారు.