నాకు టిక్కెట్ కాదంటే.. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బాలకృష్ణ చిన్నల్లుడు భరత్?
Recommended Video
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ముందస్తు ఎన్నికలపై చర్చ సాగుతోంది. ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే దాదాపు అన్ని పార్టీలు ముందస్తుకు సిద్ధమవుతున్నాయి. ముందుగానే ఎన్నికలు వచ్చినా సై అనేందుకు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం లోకసభ అభ్యర్థిత్వంపై జోరుగా చర్చ సాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ, టీడీపీ అభ్యర్థిగా కంభంపాటి హరిబాబు పోటీ చేసి గెలిచారు.
వైసీపీ నుంచి వైయస్ విజయమ్మ పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలకు భిన్నంగా వచ్చే ఎన్నికలు చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశముంది. టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేనలు ప్రధానంగా పోటీలో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి టీడీపీ తరఫున వచ్చేసారి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ పేరు వినిపిస్తోంది.
విశాఖ బరిలో బాలయ్య అల్లుడు, ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్ పేరు
బాలకృష్ణ మొదటి కూతురు బ్రాహ్మణి భర్త మంత్రి నారా లోకేష్. రెండో కూతురు తేజస్విని భర్త శ్రీభరత్. ఇతను గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని ఎంవీవీఎస్ మూర్తి భవిస్తున్నారు. తనకు కుదరదంటే తన వారసుడిగా మనవడు శ్రీభరత్కు సీటు ఇవ్వాలని ఇప్పటికే కోరారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఎంపీలుగా.. బయటి నుంచి వచ్చిన వారిదే హవా
దాదాపు మొదటి నుంచి బయటి నుంచి వచ్చి పోటీ చేసిన వారికే పెద్దపీట వేస్తూ వచ్చిన విశాఖ లోకసభ ఓటర్లు, గత ఎన్నికల్లో మాత్రం బయటి నుంచి వచ్చి పోటీ చేసిన విజయమ్మను ఓడించి బీజేపీకి చెందిన హరిబాబును గెలిపించారు. హరిబాబు కంటే ముందు పురంధేశ్వరి, అంతకుముందు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, దానికంటే ముందు ఆనంద గజపతి రాజు, ఆయన భార్య ఉమాగజపతి రాజు, మధ్యలో టీ సుబ్బిరామి రెడ్డి, ఎంవీవీఎస్ మూర్తిలు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. వీరంతా స్థానికేతరులు. అయితే హరిబాబు కూడా ఓ విధంగా స్థానికేతరుడే. ప్రకాశం జిల్లాకు చెందినవారు. కానీ ఏళ్ల క్రితమే విశాఖ వచ్చేశారు.
బీజేపీ, వైసీపీల నుంచి
బీజేపీ నుంచి మరోసారి పోటీ చేసేందుకు హరిబాబు ఆసక్తి చూపిస్తే టిక్కెట్ ఆయనకే లేదంటే మరొకరికి అవకాశం ఇస్తారు. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి సమీప బందువు నిత్యానంద రెడ్డితో పాటు ఇటీవల బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ పేరు వినిపిస్తోంది. జనసేన పార్టీ ఇంకా ఆరంభంలోనే ఉంది.
లోకేష్కు అండగా.. బాలయ్య పట్టుదల
టీడీపీ విషయానికి వస్తే ఎంవీవీఎస్ మూర్తి టిక్కెట్ ఆశిస్తున్నారు. తనకు పార్టీ అవకాశమివ్వకుంటే బాలయ్య రెండో అల్లుడు, తన మనవడు శ్రీభరత్ను రంగంలోకి దింపుతారని అంటున్నారు. ప్రస్తుతానికి గంటా శ్రీనివాస రావు అయితే బాగుంటుందని టీడీపీ భావిస్తోంది. అయితే భీమిలిలో పోటీ చేసేందుకే ఆయన మక్కువ చూపుతున్నారు. కాబట్టి ఆయన రేసులో లేరని భావించవచ్చు. ఆ తర్వాత పల్లా శ్రీనివాస రావు పేరు వినిపిస్తోంది. గతంలో పీఆర్పీ తరఫున పోటీ చేసి మంచి ఓట్లు సంపాదించారు. అయితే బాలయ్య రెండో అల్లుడు శ్రీభరత్ పేరు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎవరూ మాట్లాడలేదు. కానీ చర్చ జరుగుతున్నట్లుగా మాత్రం ప్రచారం సాగుతోంది. లోకేష్కు తోడుగా చిన్నల్లుడు శ్రీభరత్ను తీసుకురావాలనే ఆలోచన, పట్టుదల బాలయ్యకు కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.