ఐదేళ్లు కాదు త్వరలోనే... మహానాడులో బాలకృష్ణ వ్యాఖ్యల కలకలం...
ఏపీలో ఎప్పుడూ తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సినీ నటుడు, హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి మహానాడు వేదికగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రెండోరోజు మహానాడులో జూమ్ యాప్ ద్వారా బాలకృష్ణ దాదాపు 15 నిమిషాల సేపు మాట్లాడారు. ఇందులో రెండు కీలక అంశాలను ప్రస్తావించారు.
ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో కార్యకర్తలను ఉత్సాహ పరుస్తూ మాట్లాడిన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లకలం రేపుతున్నాయి. ఎన్టీఆర్ వారసుడిని తాను కాదని, టీడీపీ కార్యకర్తలే అసలైన వారసులని కార్యకర్తలను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగకుండా అధికారం కోసం ఐదేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదని, త్వరలోనే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే దాన్ని సాధించుకుందామని కార్యకర్తలకు బాలకృష్ణ సూచించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది మాత్రమే పూర్తి కావడం, మరో నాలుగేళ్ల తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో బాలకృష్ణ దేన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. అయితే కేంద్రం 2022 లేదా 2023లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని దృష్టిలో ఉంచుకునే 2024 వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదని బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చ్చ కూడా సాగుతోంది.