బాలయ్య ఏమిటీ ఆటలు.. అల్లుళ్లు సీరియస్గా పాలిటిక్స్ చేస్తుంటే .. మామ ఎంజాయ్ చేస్తున్నారు (వీడియో)
హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం కావడంతో సినీనటుడు బాలకృష్ణ అల్లుళ్లు పార్టీకి పూర్వస్థితి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్న అల్లుడు భరత్ ఒకడుగు ముందేసి దుందుకుడు స్వభావంతో మాట్లాడుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు మామ బాలయ్య మాత్రం జాలీగా గడుపుతున్నారు. పబ్లిగ్గా ఎయిర్పోర్టులో ఆటలాడుతూ కెమెరాకు చిక్కారు. ఇంకేముంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది.
జాలీగా బాలయ్య ...
సినీనటుడు, టీడీపీ నేత బాలయ్య జాలీగా గడుపుతున్నారు. హిందుపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన .. పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో ఆయన సినిమాల్లో నటిస్తూ సరదాగా గడుపుతున్నారు. తాజాగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. ఇందుకోసం గెటప్లో రెడీ అయ్యారు. అయితే ఆ సినిమా షూటింగ్కు వెళ్తుండగా విచిత్రమైన ఘటన జరిగింది. ఎయిర్పోర్టులో ఉన్న బాలయ్య .. తన సూట్ కేసును దూరంగా జరిపి వెనక్కి తిరిగి నిలబడ్డారు. ఆ సూట్ కేసు తిరిగి బాలయ్య వద్దకు చేరింది. తర్వాత దానిని దూరం పెట్టి మళ్లీ జరిపాడు. అయితే సూట్కేసుకు చిన్న దారం ఉండటం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. బాలయ్య అభిమానులు, నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియా సినిమా కోసం చేసిందా ? సరదా కోసం బాలయ్య చేశారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
సర్కార్పై సమరం ..
బాలయ్య పెద్ద అల్లుడు నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్ ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ నెల 24న చేసిన ట్వీట్ ప్రభుత్వం చేసిన లోపాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. వరద బాధితుల కోసం ప్రభుత్వం సరఫరా చేసిన మంచి నూనె ప్యాకెట్ గడువు దాటిపోయిందని గుర్తుచేశారు. వారి ప్రాణం అంటే లెక్కలేదా అని ప్రశ్నించారు. ప్రజారోగ్యంపై జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదా అని ప్రశ్నించారు. ఇదే కాదు చాలా అంశాలపై ట్వీట్లు చేస్తూ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు నారా లోకేశ్. ఈ క్రమంలో అతని మామ బాలయ్య చేసిన ఈ సరదా ఫీట్ ఆలోచింపజేసింది. అల్లుడేమో ప్రభుత్వంపై పోరాడుతుంటే .. మామ జాలీగా గడపడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
నో జూ.ఎన్టీఆర్
పెద్ద అల్లుడు ఇలా సీరియస్గా పోరాడుతుంటే .. చిన్న అల్లుడు భరత్ ఒకడుగు ముందుకేశాడు. తెలుగుదేశం పార్టీకి ఇతరుల సహకారం అవసరం లేదని చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా సినీనటుడు జూనియర్ ఎన్టీర్ టీడీపీకి ప్రచారం చేయాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. భరత్ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో చర్చానీయాంశమైంది. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమా ? లేదంటే టీడీపీ హై కమాండ్ చేయించిన ఆరోపణలా ? అనే చర్చకు దారితీసింది. అంటే టీడీపీలో లోకేశ్, తర్వాత తాను .. నారా కుటుంబ సభ్యులం మాత్రమే ఉంటామని స్పష్టంచేశారు. నందమూరి కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వబోమని తేల్చిచెప్పారు. తన సడ్డకుడు లోకేశ్ కన్నా ఒకడుగు ముందుకేసి భరత్ మాట్లాడారు. మొత్తానికి అల్లుళ్లు పార్టీ కోసం, ఏపీ రాష్ట్ర కోసం పోరాడుతుంటే .. మామ బాలయ్య ఎయిర్పోర్టులలో ఆటలాడటం చర్చకు దారితీసింది.