అలవాటు మార్చుకోండి: బాలకృష్ణ, చంద్రబాబు కార్యాలయం వద్ద జనసందోహం
హైదరాబాద్/అమరావతి: అందరు కూడా వాతారణానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ శుక్రవారం నాడు పిలుపునిచ్చారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నూతన సంవత్సర వేడుకల్లో బాలకృష్ణ పాల్గొన్నారు.
ఆయన కేక్ కట్ చేశారు. ఆసుపత్రిలో సర్వేకల్ కేన్సర్ పైన అవగాహన, పరీక్షల కోసం ఏర్పాటు చేసిన క్యాంపును ప్రారంభఇంచారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజల జీవన విధానాన్ని మార్చుకుంటే చాలు.. కేన్సర్ను జయించవచ్చునన్నారు.
వాతావరణానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని హితవు పలికారు. ఏ రంగంలోనైనా సమష్టి కృషితో విజయం సాధ్యమని తెలిపారు. కేన్సర్ పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలన్నారు. తమ ఆసుపత్రి ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయం వద్ద జన సందోహం
నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపేందుకు క్యాంపు కార్యాలయానికి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. సీఎస్, డిజిపి, ఇతర అధికారులు చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి యుననేత నారా లోకేష్, వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ 2016 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.