దోచుకొని పార్టీ: జగన్పై బాలకృష్ణ, టిలో నగ్మా రోడ్డు షో
అనంతపురం/నిజామాబాద్: దోచుకున్న సొమ్ముదో వైయస్ జగన్ పార్టీ పెట్టారని, ఆయనది అవినీతి విజన్ అని తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ ఆదివారం అన్నారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి ఆర్థిక నిపుణుడిగా కీర్తి గడిస్తే, జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుకుపెట్టుకుని లక్షకోట్ల అవినీతికి పాల్పడి అవినీతి నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ కొన్ని వేల కోట్లు సంపాదించారని, ఆ సొమ్ముతో వ్యవసాయ రుణాల మాఫీ చేయవచ్చునన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. హంద్రి - నీవా కాలువ ద్వారా ఈ ప్రాంతానికి నీరందజేస్తామన్నారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ అమలు చేస్తామన్నారు.
పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చడమే కాకుండా ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తామన్నారు. ఓటు అనే ఆయుధంతో అవినీతి పార్టీలైన కాంగ్రెస్, జగన్ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. అనంతపురం జిల్లాను తాను దత్తత తీసుకుంటానని చెప్పారు. శ్రీశైలం జలాశయం నుండి జిల్లాకు తాగునీరు అందిస్తామన్నారు. కాంగ్రెసు పార్టీ హయాంలో అన్నీ కుంభకోణాలే అన్నారు.
అధిష్టానం చెబుతుంది: విజయశాంతి
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మహిళను చూడాలని ఉందన్న రాహుల్ గాంధీ ఆకాంక్ష పైన మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న విజయశాంతి స్పందించారు. మహిళా సిఎం ఎవరనే విషయం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు.
రాహుల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ గొప్పదనాన్ని వెల్లడిస్తున్నాయని, మెదక్ ఎంపీగా తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ప్రముఖ నటి నగ్మా ఆదివారం నిజామాబాద్లో రోడ్షోలు నిర్వహించనున్నారు.