16న బాలయ్య నామినేషన్, నిలబడట్లేదని వేణుమాధవ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో హీరో, ఆ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ శనివారం సమావేశమయ్యారు. హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్ఘని, పలువురు నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీ చేయనున్నారు. ఈ నెల 16న ఉదయం 11:30 గంటలకు హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణను బరిలోకి దించితే భారీ మోజార్టీతో గెలిపించుకుంటామని హిందూపుర్ నుండి వచ్చిన టిడిపి కార్యకర్తలు, నేతలు చంద్రబాబు నివాసం వద్ద ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు చంద్రబాబును ప్రముఖ సినీ నటుడు వేణుమాధవ్ కలిశారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, టిడిపి తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు.
విశాఖను రాజధాని చేయాలి
విశాఖను సీమాంధ్రకు రాజధాని చేయాలని కేంద్రమంత్రి కిశోర్ చంద్ర దేవ్ వేరుగా అన్నారు. రాజధానిగా చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు విశాఖపట్నంలో ఉన్నాయని చెప్పారు. విజయవాడను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలని, రాయలసీమలో మినీ అసెంబ్లీని నెలకొల్పి ఒక సెషన్ శాసనసభ సమావేశాలు అక్కడ నిర్వహించాలని కోరారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రి మండలికి ఈ విషయమై లిఖిత పూర్వకంగా తన మనోగతాన్ని వివరించానని తెలిపారు.
శనివారం విజయనగరం జిల్లా కురుపాంకోటలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అనేక ఆలిండియా ఇనిస్టిట్యూట్స్ సీమాంధ్రలో నెలకొల్పే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎయిమ్స్, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, పెట్రోలియం రిఫైనరీ, ప్రత్యేక రైల్వేజోన్, ఎన్ఐఐటీ, ఐఐఎం, వంటి సంస్థలు నెలకొల్పడం వల్ల సీమాంధ్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ను స్పెషల్ కేటగిరీ జోన్గా కేంద్రం గుర్తించినందున ప్రత్యేక నిధులు వస్తాయన్నారు. కొత్తగా ఏర్పాటుచేసే పరిశ్రమలకు ఐదేళ్లపాటు టాక్స్ హాలిడే ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటూ బిజెపి నేత సుస్మాస్వరాజ్ కేంద్రాన్ని పదే పదే కోరారని, అటువంటి పార్టీతో జతకట్టిన తెలుగుదేశం ప్రస్తుతం సమైక్యవాదాన్ని వినిపించడం హాస్యాస్పదమని కిశోర్ ఎద్దేవా చేశారు. ఈ నెల 17న అరకు పార్లమెంటు నియోజకవర్గానికి నామినేషన్ వేస్తానన్నారు.