పేరు మార్చాలన్న బాలకృష్ణ, బాధ్యత మీదేనని బీజేపీపై జేపీ అసహనం
అనంతపురం: గొల్లపల్లి రిజర్వాయర్ పేరును ఎన్టీఆర్ సాగర్ అని పేరు మార్చాలని తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ సోమవారం డిమాండ్ చేశారు. బాలయ్య, మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, పరిటాల సునీత తదితరులు సాయంత్రం గొల్లపల్లి రిజర్వాయర్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. తన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా హిందూపురానికి నీటి సరఫరా చేస్తామని హామీ చెప్పారు. అంతకుముందు బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వం పైన మండిపడిన విషయం తెలిసిందే. ఏపీకి బడ్జెట్లో సరైన కేటాయింపులు జరపలేదని నిప్పులు చెరిగారు.
కేంద్రాన్ని ప్రశ్నించిన జేపీ
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడంపై లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ సోమవారం స్పందించారు. హైదరాబాదును కోల్పోవడం వల్ల ఏర్పడే నష్టాన్ని కేంద్రం ఐదేళ్లలో భర్తీ చేయాలన్నారు.
రాష్ట్ర రెవెన్యూ లోటు పైన ఆర్థిక సంఘం పూర్తి వివరాలు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికనే పరిగణలోకి తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక సంఘం చెబుతోందన్నారు. వాస్తవంగా చెప్పాలంటే రెవెన్యూ లోటు ఆర్థిక సంఘం చెప్పిన దానికంటే ఎక్కువే ఉందన్నారు. ఆర్థిక సంఘం చెప్పిన లోటును భర్తీ చేయాలన్నారు. అంకెలను తారుమారు చేసి మోసం చేస్తున్నారన్నారు. ఎవరో దానంగా తీసుకునేది కాదని, నిధులు అడగటం మన హక్కు అన్నారు.