హిందూపురంలో సర్వే, ఉద్రిక్తత: 'వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓటమి ఖాయం'
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ ఓడిపోవడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నవీన్ నిశ్చల్ అన్నారు. హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూని అయిందన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రలోభపెడుతున్న వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. సర్వే పేరుతో వైసీపీ నేతల కీలక సమాచారాన్ని సేకరించడం దుర్మార్గం అన్నారు. టీడీపీ నేతలు భయపడి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓటమి ఖాయమన్నారు.
కాగా, అంతకుముందు దాదాపు పదిహేను మంది నాయకులు హిందూపురంలో సర్వే నిర్వహించారు. వారు సర్వే పేరుతో వైసీపీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తే ప్యాకేజీ ఇస్తామంటూ ఎరవేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
హిందూపురంలో ఉద్రిక్తత, కేసు
నవీన్ నిశ్చల్ హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్. ఆయనతో పాటు ఆయన అనుచరులు 12మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడ్రోజులుగా పట్టణం, హిందూపురం గ్రామీణ ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రాజకీయ సర్వే చేస్తున్నారు.
తమను అడ్డుకున్నారని, నవీన్ నిశ్చల్ అనుచరులు లాడ్జి నుంచి ఆటోలలో తీసుకు వెళ్లి దాడి చేశారని సర్వేబృందం సభ్యుడు ఫిర్యాదు చేయటంతో శుక్రవారం రాత్రి పట్టణ సీఐ సూచన మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. శనివారం డీఎస్పీలు పట్టణంలో పరిస్థితి సమీక్షించారు.
నవీన్ నిశ్చల్, వైసీపీ నాయకులు ప్రెస్ క్లబ్లో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లారు. నాయకులు బయటకొచ్చి సీఐలు, ఎస్ఐలతో మాట్లాడేలోపే నవీన్ నిశ్చల్, మరికొందరు అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొన్నామని, నవీన్ నిశ్చల్, పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామన్నారు. త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.