బాలాపూర్ లడ్డు9.5లక్షలు, అమీర్పేటలో 10.8లక్షలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంపాదించుకున్న బాలాపూర్ లడ్డూ వేలంపాట ముగిసింది. బాలాపూర్ లడ్డూ 9 లక్షల యాభై వేలు పలికింది. బాలాపూర్ లడ్డూ కోసం ప్రముఖులు, రాజకీయ నాయకులు పోటీ పడ్డారు. మొత్తం 24మంది ప్రముఖులు వేలంలో పాల్గొన్నారు. సింగిరెడ్డి జయేందర్ రెడ్డి ఈ లడ్డూను తొమ్మిదిన్నర లక్షలకు దక్కించుకున్నారు. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ 24వేలు అధికంగా పలికింది.
కాగా, బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ముస్లింలు సైతం పాల్గొంటారు. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డూను వేలం వేయడం ప్రారంభించారు. ఆ ఏడాది కేవలం రూ.450కి లడ్డూ అమ్ముడుపోయింది. అయితే, ఏడాదికేడాదికీ లడ్డూ వేలం పెరుగుతూనే ఉంది. పోయిన ఏడాది హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలకు లడ్డూను వేలంపాటలో సొంతం చేసుకున్నారు.
లడ్డూను దక్కించుకున్న అనంతరం సింగిరెడ్డి జయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న వారు సంతోషంగా ఉన్నారని, ఆర్థికంగా ఎదిగారని, గత ఏడాది లడ్డూను దక్కించుకున్న తీగల కృష్ణా రెడ్డి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారని, ఆయన కోరికను గణనాథుడు తీర్చారని, తాను కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో లడ్డూను కొన్నానని చెప్పారు.
ఖైరతాబాద్ గణేషుడిపై పూలవర్షం
ఖైరతాబాద్లో గణపతి వద్ద భక్తుల కోలాహం అధికంగా ఉంది. నిమజ్జనం దృష్ట్యా మహాగణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఉదయం నుంచే తరలిస్తున్నారు. ఖైరతాబాద్ గణేషుడిపై హెలికాఫ్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. అందుకోసం కమిటీ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.
రూ.10.8 లక్షలు పలికిన అమీర్ పేట లడ్డూ
హైదరాబాదులోని అమీర్ పేటలో గణేషుడి లడ్డూ రూ.10.8 లక్షలు పలికింది. ఈ లడ్డూను రియల్ ఎస్టేట్ వ్యాపారి బాబు వేలంలో దక్కించుకున్నారు. నిమజ్జనం ప్రశాంతంగా సాగుతుందని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించామన్నారు. నిమజ్జనం త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు.