వైసీపీ ఎమ్మెల్యేలకు బాలయ్య కౌంటర్..! అవాక్కయిన అదికార పక్షం..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతో హుందాగా వ్యవహరించారు. ఎప్పుడూ ముక్కు మీద కోపంతో, ఆవేశంతో ఏం మాట్లడతరో అర్థం కాకుండా ఉండే బాలయ్య సభలో చోటు చేసుకున్న ఓ అంశంపై పరిపక్వత కనబరిచారు. అంతే కాదు అదే అంశంపై టీడిపి ఎమ్మెల్యేలతో ఓ ఆట ఆడుకుంటున్న అదికార పార్టీ ఎమ్మెల్యేల నోళ్లను బాలయ్య మూయించగలిగారు. పలు వేదికలపైన సీరియస్ గా మాట్లాడాలనుకుని కామెడీ పండించే బాలయ్య నేటి అంసెం్బ్లీలో మాత్రం ఎంతో మెచ్యూరిటి కనబరిచినట్టు చర్చ జరుగుతోంది.
బాలయ్య బాబు వ్మాఖ్యలకు అదికార పార్టీ నాయకులు కూడా కౌంటర్ ఇవ్వడం ఎందుకులే అని సర్దుకుకుపోతున్నట్టు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నోట నుంచి వచ్చిన 'బంట్రోతు' మాట పెద్ద రచ్చనే క్రియేట్ చేసింది. అధికార, విపక్షాల మధ్య ఈ మాటపై జరిగిన వాదోపవాదాలు సభను వేడెక్కించాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం చొరవతో ఎలాగోలా సభలోె గందరగోళం సద్దుమణిగినా... ఈ మాటపై రచ్చ కొనసాగుతూనే ఉంది.
ఇకపైనా ఈ మాటపై వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధం జరగడం ఖాయమేనన్న వాదనా లేకపోలేదు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కామెంట్ పై తనదైన శైలి పంచ్ వేశారు. వైసీపీ నోట నుంచి కౌంటర్ రాని విధంగా తనదైన శైలి కామెంట్ చేసిన బాలయ్య... మీడియా ప్రతినిధులనే ఆశ్చర్యానికి గురి చేశారు. అయినా బంట్రోతు కామెంట్ పై బాలయ్య ఎలాంటి కౌంటర్ ఇచ్చారన్న విషయానికి వస్తే... రాజకీయ నేతలంతా ప్రజలకు బంట్రోతులేనని ఆయన తనదైన శైలిలో సెటైర్ వేశారు.
బంట్రోతు కామెంట్ పై బాలయ్య కౌంటర్ ఇలా సాగింది. 'ఎవరు అయితేనేం. మనం ప్రజలకు సేవకులం. అధికారంలో ఉండొచ్చు. ప్రతిపక్షంలో ఉండొచ్చు. అందరూ ప్రజల బంట్రోతులే. ప్రజల కోసం కష్టపడటానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులం' అంటూ బాలయ్య చాలా సూటిగా కౌంటర్ ఇచ్చేశారు. బాలయ్య ఇచ్చిన కౌంటర్ కు వైసీపీకి ప్రత్యేకించి ఆ కామెంట్ చేసిన చెవిరెడ్డికి నిజంగానే అవాక్కయ్యారనే చర్చ అమరావతిలో తారా స్థాయిలో నడుస్తోంది.