అందుకే! హిందూపురంలో ఓటు నమోదు చేసుకున్న బాలకృష్ణ: ట్రాక్టర్ నడిపి హల్చల్
అనంతపురం: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ఓటుహక్కు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని తన ఇంటి చిరునామాతో గురువారం ఓటు నమోదు చేయించుకున్నారు. తహశీల్దార్ విశ్వనాథ్ బాలకృష్ణ ఇంటికి చేరుకొని ఓటు నమోదుకు అవసరమైన పత్రాలపై ఆయన నుంచి సంతకాలు తీసుకున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించుకున్న బాలకృష్ణ తాజాగా హిందూపురంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలయ్యకు ఏపీలో ఓటు హక్కు లేదంటూ విపక్షాలు ఆయనపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, గురువారం తన నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ హిందూపురంలోని ఎంజీఎం మైదానంలో రైతు రథం పథకం కింద 30 ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయంలో నూతన అధునాత పద్ధతుల ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చే పంటలను సాగుచేసే విధంగా సాంకేతిక నైపుణ్యాన్ని తీసుకొచ్చారన్నారు. రైతులకు రూ.24వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని చెప్పారు. అనంతరం హిందూపురం పట్టణంలోని ఆర్ఎంఎస్ ఫంక్షన్ హాలులో మైనార్టీ మహిళలకు బాలకృష్ణ 200 కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
Recommended Video