బురద చల్లటానికే ఇదంతా ... నిరూపిస్తే ఆ 493 ఎకరాలు రాసిస్తా అంటున్న బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు బినామీ పేర్లతో తక్కువ ధరకు భూములను కొనుగోలు చేశారని వైసీపీ మంత్రి బొత్సా సత్యన్నారయణ ఆధారాలతో సహా బయట పెడతామని విరుచుకుపడుతున్నారు. అమరావతి భూముల వ్యవహారంపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణలపై బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ క్లారిటీ ఇచ్చారు. ఇది కావాలని తన మీద బురద చల్లటం కోసం చేస్తున్న ఆరోపణలు తప్ప మరేం కాదని ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోక ముందు తీసుకున్న భూమిని, రాజధాని ఏర్పడిన తర్వాత తీసుకున్న భూమిగా లింక్ పెట్టి మాట్లాడటం కేవలం రాజధాని అమరావతిపై, టీడీపీ నాయకులపై బురద చల్లటమే అని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న: రాజు మారితే రాజధాని మారాలా...?
బాలయ్య వియ్యంకుడికి అమరావతి భూములు ధారాదత్తం చేశారని బొత్సా ఆరోపణలు
ఇటీవలే అమరావతి భూముల్లో చంద్రబాబు నాయుడు బినామీలు, బంధువులు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారంటూ బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే . బాలకృష్ణ వియ్యంకుడికి చంద్రబాబు 493 ఎకరాల భూమిని ఏపీఐఐసీ కింద ఎకరం లక్ష రూపాయలకే కారుచౌకగా ఇచ్చారని బొత్సా ఆరోపించారు. తిరిగి ఆ భూములను సీఆర్డీఏ పరిధిలోకి తీసుకువచ్చారని చెప్పిన బొత్సా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని ఆరోపించారు. సీఆర్డీఏ పరిధి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడర్ జరిగిందనడానికి ఇలాంటి ఉదాహరణలే నిదర్శనమని చెప్పిన బొత్సా సత్యన్నారాయణ బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ ను టార్గెట్ చేశారు.
అమరావతిపై రాజధాని రైతులకు అన్యాయం చేసే కుట్ర అన్న శ్రీ భరత్
దీంతో శ్రీ భరత్ అమరావతిపై బురద చల్లడానికి తనను పావుగా వాడుకుంటున్నారని, తనను చూపించి వేలాది మంది రైతులకు అన్యాయం చేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.సీఆర్డీఏ పరిధిలోని జయంతిపురం భూములపై ఎలాంటి నిర్ణయానికి అయినా తాను సిద్ధమేనంటూ సవాల్ విసిరారు శ్రీ భరత్. జయంతిపురంలో రాజధాని సమయంలో తమ పేరు మీద 493 ఎకరాలు ఉన్నాయంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు నిజమని నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఆరోపణలు చేసినప్పటికీ తాను ఊరుకున్నానని, ఎన్నికల తర్వాత కూడా తనపై బురద చల్లడం సరికాదన్న ఆయన బొత్సా చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్తూనే అసలు విషయం చెప్పారు.
రాజధాని భూములు మా అధీనంలో ఉన్నాయని రుజువు చేస్తే ప్రభుత్వానికే రాసిస్తా అన్న శ్రీ భరత్
అమరావతికి 120 కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లా జయంతిపురంలో గ్యాస్ ఆధారిత విద్యుచ్ఛక్తి ప్లాంట్ కోసం 2007లో 498.39 ఎకరాలు తీసుకున్నామని, బొత్స చూపించిన జీవో 2012లో జారీ చేశారని ఆయన చెప్పారు. 2007లో తీసుకున్న స్థలానికి అమరావతి భూములకు బొత్సా ఎలా లింక్ పెడతారని ఆయన మండిపడ్డారు. తన పెళ్లికి ముందు జరిగిన వ్యవహారాన్ని తర్వాత పరిణామాలకు ముడి పెడుతున్నారని, అనవసరంగా తన మామపై, తమపై అభాండాలు వేస్తున్నారని శ్రీ భరత్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో ఎపిఐఐసి ధర పెంచిందని, ఉద్దేశ్యపూర్వకంగ హైకోర్టుకు వెళ్లారని ఆయన చెప్పారు. తమపై వైసీపీ మంత్రి బొత్సా చేసిన ఆరోపణలు నిజమని రుజువు చెయ్యాలని డిమాండ్ చేసిన శ్రీ భరత్ ఆ 493 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తామంటూ సవాల్ విసిరారు . ఆ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని తేలితే ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చేస్తానని ప్రకటించారు శ్రీభరత్.