నిజమే కానీ, అందుకే పార్టీకి దూరంగా ఉన్నా: బాలినేని
ఒంగోలు: పార్టీలో చిన్న చిన్న సమస్యలు వాస్తవమేనని, తాను వ్యక్తిగత కారణాలతో ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మంగళవారం నాడు స్పష్టం చేశారు. బాలినేని పార్టీ మారుతారనే ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే.
వైయస్ జగన్మోహన్ రెడ్డికి బంధువు అయిన బాలినేని పార్టీ మారుతారనే ప్రచారం జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. తనకు తమ పార్టీ అధినేత జగన్ నాయకత్వం పైన విశ్వాసం ఉందని చెప్పారు. ఇన్నాళ్లు వ్యక్తిగత కారణాలతో పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పారు.
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. తాను మంత్రి పదవిని వదులుకొని మరీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను జగన్ వెంటే ఉంటానని చెప్పారు. తాను అసలు టిడిపితోనే మాట్లాడలేదన్నారు.
అలాంటప్పుడు ఆ పార్టీలోకి వస్తానని ఎందుకు ప్రచారం జరుగుతోందన్నారు. తాను టిడిపిలో చేరుతానని ఆ పార్టీ నేతలకు ఎవరికి హామీ ఇచ్చారో తెలియదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా కొట్టి పారేశారు. బాలినేని నాయకత్వంలో పని చేస్తానని, ఇలాంటి సమయంలో తమ మనోభావాలు దెబ్బతినేలా కథనాలు రాయడం సరికాదన్నారు.