బాలినేని సైతం జగన్కు షాక్: నలుగుర్ని సైకిలెక్కించేది ఆయనే?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సైతం షాక్ ఇవ్వడానికి సిద్ధపడినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు శాసనసభ్యులను తీసుకుని ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు చెబుతున్నారు. బాలినేని శ్రీనివాస రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కావడం గమనార్హం.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరే నలుగురు శాసనసభ్యులకు కూడా బాలినేని శ్రీనివాస రెడ్డి నాయకత్వం వహిస్తారని అంటున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్రాజ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే రామారావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే సురేష్లు టిడిపిలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ నల్గురు ఎమ్మెల్యేలు బాలినేని నాయకత్వంలో టీడీపీలో చేరే అవకా శాలున్నాయని అంటున్నారు.
ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత బాలినేని ఎమ్మెల్సీ పదవి ఆశించారు. అయితే జగన్ బాలినేనికి కాకుండా మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దానితో అసంతృప్తికి గురైన బాలినేని కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
అదే సమయంలో జగన్ కూడా ఆయన్ని దూరం పెట్టారనే ప్రచారం జిల్లాలో జోరందుకుంది. జిల్లా వ్యవహా రాలన్ని జగన్మోహన్రెడ్డి చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి చూసుకుంటున్నారు. దీంతో గత కొంత కాలంగా పార్టీ నాయకత్వంతో బాలినేని అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.
దాన్ని గమనించిన టీడీపీ నాయకత్వం తమకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియా సంస్థ అధిపతిని రంగంలోకి దించి బాలినేనితో మాట్లాడించినట్లు తెలుస్తోంది. బాలినేనిని అధికార పార్టీలో చేరే విధంగా ఆ మీడియా సంస్థ అధిపతి ఒప్పించారని అంటున్నారు. ఆర్ధికంగా బాగా దెబ్బతిన్న బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం అంగీకరించినట్లు సమాచారం. దాంతో ఆయన పార్టీ వీడేందుకు మొగ్గు చూపుతున్నా రని అంటున్నారు.