కేంద్రం కంటే, తెలంగాణే: బాల్క సుమన్, జానా ఆగ్రహం
హైదరాబాద్: కేంద్రంతో ఎలా ఉండాలనుకున్న దానికంటే తెలంగాణ ప్రజల సమస్యల తీర్చడంలో అండగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ పనులసమస్యల పరిష్కారానికి కేంద్రం పైన ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇతర పార్టీలు కూడా కలిసి రావాలన్నారు.
ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలన్నారు. పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాల పైన ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు దిశా నిర్దేశనం చేశారన్నారు. అభివృద్ధి పనుల కోసం ఎంపీ లాడ్స్ రూ.5 కోట్లు సరిపోవడం లేదని, రూ.8 కోట్లకు పెంచాలని తెరాస ఎంపీలం ప్రధానికి లేఖ రాశామన్నారు.
ఈ నెల 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఈ విషయమై మాట్లాడుతామన్నారు. ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ రాష్ట్రానికి సమస్యలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
తెరాస ప్రభుత్వాన్ని పని చేసుకోనీయకుండా కుట్రలు చేస్తున్నారని, శంషాబాద్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టే ముందు రాష్ట్ర ప్రభత్వాన్ని సంప్రదిస్తే బాగుండేదన్నారు. విమానాశ్రయం పేరు మార్పు పైన పార్లమంటులో గళమెత్తుతామన్నారు. కేంద్రం సీమాంధ్ర నేతలకు వంత పాడుతోందన్నారు. టీడీపీ నేతలు ఆంధ్రా నేతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతల మండిపాటు
శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. బేగంపేట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద హన్మంతరావు, జానారెడ్డి తదితరులు ధర్నా చేపట్టారు. డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును తొలగించే దాకా నిరసనను విరమించేది లేదని వీహెచ్ చెప్పారు. ఎన్టీఆర్ పైన టీడీపీ దొంగ ప్రేమ చూపిస్తోందన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు సృష్టించినట్లయిందని, దీని పైన కేంద్రం ఆలోచించాలని జానా అన్నారు.