తెలంగాణ విచ్ఛిన్నానికి ఆ సంపాదన: బాబుపై సుమన్, ఎన్టీఆర్ ఫ్యామిలీకి సూచన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణలో క్యాంప్ ఏర్పాటు చేసుకోవడంపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ శనివారం మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దొంగల ముఠాను ఏర్పాటు చేసి తెలంగాణకు పంపించారని ధ్వజమెత్తారు.
అక్రమ సంపాదనను తెలంగాణలో ఖర్చుపెట్టి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ నడుస్తోందని, దీనిపై గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. వారు స్పందించకుంటే తెరాస కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు వెంటపడి తరిమేలా చేస్తారన్నారు.
ఇన్నాళ్లు చంద్రబాబుపై కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆయన చేతులు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఏజెంట్లు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, చంద్రబాబు కుట్రలకి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన ఆక్రమాలకు నాలుగైదుసార్లు జీవిత ఖైదు వేసినా సరిపోదన్నారు.
ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబును టీడీపీ నుంచి తరిమేయాలన్నారు. చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసు పెడితే తెలంగాణను లాగడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలు ఆపకపోతే ఆయనను తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబును ఏపీ ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారని వారికి సేవ చేయాలన్నారు. అక్కడి ప్రజల సొమ్ముతోనే ఏపీ పోలీసులకు జీతాలు వస్తున్నాయని, వారిని రక్షించడానికే పని చేయాలన్నారు.