రాష్ట్ర పండుగగా బాలు జయంతి: సీఎం జగన్కు లేఖ, అంతర్వేది రథ నిర్మాణంపై చంద్రబాబు ఇలా
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం ఓ లేఖ రాశారు. దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్మృత్యర్థం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఈ మేరకు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్ర పండుగగా బాలు జయంతి..
అంతేగాక, ప్రతి సంవత్సరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని, సంగీత వర్సిటీలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రాంతాన్ని బాలు కళాక్షేత్రంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు కోరారు. ఎస్పీ బాలు పేరిట జాతీయ పురస్కారాన్ని అందించాలని, ప్రభుత్వ సంగీత అకాడమీకి ఎస్పీ బాలు పేరు పెట్టాలని చంద్రబాబు సూచించారు.
అదే బాలుకు ఇచ్చే నిజమైన నివాళి..
లలిత కళలకు ప్రోత్సాహం అందించడంపైనా చంద్రబాబు పలు సూచనలు చేశారు. సంగీతం, లలిత కళల్లో యువతరాన్ని ప్రోత్సహించడం ద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలను సమున్నతస్థాయిలో నిలబెట్టడమే బాలసుబ్రహ్మణ్యంకు మనం అందించే నిజమైన నివాళి అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
అంతర్వేది రథ నిర్మాణం వారి ద్వారానే జరగాలి..
‘అంతర్వేది నూతన రథ నిర్మాణ పనులను టెండర్లు పిలవకుండానే అప్పగించడంపై అగ్ని(వన్నియ)కుల క్షత్రియుల మనోభావాలు దెబ్బతిన్నాయి.రథాన్ని స్వామివారి ప్రతిరూపంగా భావించే ఈ అగ్నికుల క్షత్రియులే 1823లో అంతర్వేది ఆలయాన్ని నిర్మించి,నిర్వహణ కోసం1800 ఎకరాల భూమిని ఇచ్చారన్న సంగతి మర్చిపోకూడదు. ‘ఆలయ నిర్మాణం చేసిన అగ్నికుల క్షత్రియులే రథ మరమ్మతులు,నిర్వహణతో పాటు,రథానికి తొలి కొబ్బరికాయ కొట్టడం,రథాన్ని లాగడం 200 ఏళ్ళుగా చేస్తున్నారు. అలాంటిది రథ నిర్మాణం విషయంలో తమ ప్రతిభను గుర్తించలేదంటోన్న వారి బాధను ప్రభుత్వం అర్థం చేసుకుని తక్షణమే స్పందించాలని కోరుతున్నాను' అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి విన్నవించారు.