ఉద్యోగులపై దత్తాత్రేయ, నిధులిస్తున్నా రెచ్చగొడ్తారా: బాబుపై సోము వీర్రాజు సంచలనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా తాను కేంద్రంతో మాట్లాడుతానని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం అన్నారు. ఉద్యోగుల విభజన, వారి సమస్యల పైన తాను మాట్లాడుతానని చెప్పారు.
ఏపీ, తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగనివ్వనని చెప్పారు. ఉద్యోగులు బాధపడితే అభివృద్ధికి ఆటంకం అన్నారు. హైకోర్టు విభజన వేగవంతం అయ్యేలా చూస్తానని చెప్పారు.
టిడిపి ప్రభుత్వంపై సోము వీర్రాజు ఆగ్రహం
తెలుగుదేశం ప్రభుత్వం పైన బిజెపి నేత సోము వీర్రాజు శుక్రవారం నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వైఫల్యంతో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయన్నారు. ఏపీలో సివిల్ సప్లై, విజిలెన్స్ నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. ఏపీకి కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తున్నప్పటికీ.. ప్రత్యేక హోదా అంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రం మెడలు వంచుతాం: రఘువీరా రెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము అవసరమైతే కేంద్రం మెడలు వంచుతామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి శుక్రవారం అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో... నాటి చట్టంలో లేదని చెప్పడం సరికాదన్నారు. దానికి చట్టంతో పని లేదన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని చెప్పడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే అన్నారు. కేబినెట్ నిర్ణయం ద్వారా ప్రత్యేక హోదాను ఇవ్వవచ్చన్నారు. అవినీతి సొమ్ము కోసమే పట్టిసీమ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు.
2019 నాటికి పోలవరం పూర్తి కాకపోతే తెలుగుదేశం పార్టీ దోషిగా మిగిలి పోవడం ఖాయమన్నారు. టీడీపీ, బీజేపీ నేతల బండారాన్ని బయటపెట్టేందుకు తిరుపతిలో ప్రత్యేక హోదా అంశంపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
భూమి విషయంలో న్యాయం కోసం పోరాడుతా: సి కళ్యాణ్
నెల్లూరు పట్టణంలో 2008లో తాను కొనుగోలు చేసిన భూమి విషయంపై న్యాయపోరాటం చేస్తానని సినీ నిర్మాత సి కల్యాణ్ చెప్పారు. తాను భూమి కొనేటప్పుడు ఎలాంటి వివాదాలు లేవన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి, నెల్లూరు నగర మేయర్లు రాజకీయం చేసి వివాదాన్ని సృష్టించారని ఆరోపించారు. వారు సజీవ సమాధి అయితే తానే ఆ స్థలంలో మసీదు నిర్మాణం చేపడతానని చెప్పారు.