షాకయ్యా: రోహిత్ సూసైడ్పై దత్తాత్రేయ, రాహుల్ హఠాత్తు టూర్పై కామినేని ఫైర్
గుంటూరు/హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్యపై నేపథ్యంలో విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయ బుధవారం నాడు స్పందించారు. రోహిత్ ఆత్మహత్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
రోహిత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆగస్టు 10న తనకు అందిన వినతి పత్రాన్ని కేంద్ర మానవ వనరుల శాఖకు పంపానని చెప్పారు. ఆగస్టు 29న అందిన మరో వినతి పత్రాన్ని మరోసారి కేంద్ర మానవ వనరుల శాఖకు పంపానని తెలిపారు.
అయితే వినతి పత్రాలు పంపడం వరకే తన పాత్ర పరిమితమన్నారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిగల సంస్థ అన్నారు. ఇందులో తన పాత్ర ఏమీ లేదని బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ అప్పుడు రాలేదేం: కామినేని
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ హఠాత్తుగా హైదరాబాద్ రావడాన్ని బిజెపి నేత, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు తప్పుబట్టారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే రాహుల్ భాగ్యనగరం వచ్చారన్నారు. గతంలో ఎన్నో ఆత్మహత్యలు జరిగినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
రోహిత్ తాత, నాయనమ్మను విచారించిన పోలీసులు
హెచ్సీయూలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతిపై హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా రోహిత్ బంధువులను విచారిస్తున్నారు. గుంటూరు జిల్లా గురజాలలో నివాసముంటున్న రోహిత్ తాత, నాయనమ్మలను మాదాపూర్ ఏసీపీ రమణ కుమార్ బుధవారం విచారించి వివరాలు సేకరించారు. వారి రేషన్కార్డును పరిశీలించారు.