స్వైన్ఫ్లూపై సాయమడిగిన కేసీఆర్: దత్తాత్రేయ, వెంకయ్యల చొరవ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ఫ్లూ పరిస్థితిపై తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారు. వెంకయ్య నేరుగా మోడీ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాతో చర్చించారు. దత్తాత్రేయ హైదరాబాద్ నుంచే ప్రధాని మోడీతో, నడ్డాతో ఫోన్లో మాట్లాడారు.
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అడిషనల్ డీజీ అశోక్ కుమార్, జాతీయ వ్యాధి నియంత్రణ విభాగం ఏడీజీ డాక్టర్ శశిఖేర్, కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రదీప్ గురువారం ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటారని వారు తెలిపారు. ఇక్కడి పరిస్థితులపై గంటగంటకూ సమాచారం తెప్పించుకొంటున్నట్లు కేంద్రమంత్రి జేపీ నడ్డా తనతో చెప్పారని దత్తాత్రేయ అన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 230మంది స్వైన్ఫ్లూతో ఆస్పత్రుల్లో చేరినట్లు నడ్డా వద్ద సమాచారం ఉందన్నారు. తన శాఖ పరిధిలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అవసరమైన వ్యాక్సిన్,మాస్క్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు దత్తాత్రేయ చెప్పారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనతో మాట్లాడి కేంద్రం సాయం కోరాలని అడిగారని, రాష్ట్ర ప్రభుత్వం సాయం అడిగినప్పుడు అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పరిస్థితి అదుపులో ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య ఇప్పటికీ చెబుతున్నట్లు దత్తాత్రేయ వివరించారు. స్వైన్ఫ్లూతో ఒకేరోజు ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. స్వైన్ ఫ్లూ నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం
స్వైన్ఫ్లూపై అధ్యయనానికి ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం గురువారం ఉదయం నగరానికి చేరుకుంది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, డీఎంఈ, ఐపీఎం సంచాలకులు సందర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం సీఎం కేసీఆర్తో కేంద్ర బృందం సమావేశం కానున్నారు.