బంద్తో బస్సులకి బ్రేక్: బైక్ ర్యాలీ, బందోబస్తు (పిక్చర్స్)
హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణవ్యాప్తంగా గురువారం బంద్ కొనసాగుతోంది. తెరాస ఇచ్చిన పిలుపుకు బిజెపి, సిపిఐలతో పాటు పలు తెలంగాణ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. తెలంగాణలోని పది జిల్లాల్లో ఎక్కడికి అక్కడే బస్సులు నిలిచిపోయాయి.
నగరంలోని పలు కూడళ్లలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, కోఠి, పంజాగుట్ట, అమీర్ పేట్, మియాపూర్, గచ్చిబౌలి కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసి బస్సులు పాక్షికంగా నడుస్తున్నాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి దూర ప్రాంతాలకు వెళ్లే నాలుగు వేల బస్సుల్లో పెద్ద మొత్తంలో నిలిచిపోయాయి. రైల్వే స్టేషన్లలో బందు ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.
కరీంనగర్ జిల్లాలోని సిద్దిపేటలో తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. రాయల తెలంగాణకు తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెప్పారు. ఆర్టీసి కార్మికులు బందులో పాల్గొంటున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
ఖమ్మం, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. విధులకు ఎవరూ హాజరు కావడం లేదు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర తెలంగాణ జిల్లాల్లో బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి.
ఉస్మానియా, కాకతీయ వర్సిటీల్లో..
రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ హైదరాబాదులోని ఉస్మానియా, వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారీ ర్యాలీలు చేస్తున్నారు.
బంద్ 1
రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్లో నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణవాదులు.
బంద్ 2
రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు.
బంద్ 3
కాంగ్రెసు పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ఎల్బీనగర్ చౌరస్తాలో బైక్ ర్యాలీ తీస్తున్న తెలంగాణవాదులు.
బంద్ 4
కాంగ్రెసు పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ఎల్బీనగర్ చౌరస్తాలో భారీగా మోహరించిన పోలీసులు