మాపై దాడులు, అరెస్ట్లు.. ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు : ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన కొత్త పీఆర్సీ వివాదానికి ఇప్పుడిప్పుడే తెరపడేలా కన్పించడంలేదు. జీవోలను రద్దు చేసేవరకు తమ పోరాటాన్ని విరమించేది లేదని ఉద్యోగ సంఘాలు తేల్చిచెబుతున్నాయి. చర్చలకు రావాలని ప్రభుత్వ పెద్దలు ఉద్యోగ సంఘాల నేతలను రెండు సార్లు ఆహ్వానించినా వారు తిరస్కరించారు. ఇప్పటికే సమ్మెనోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం తమపై కక్షపూరిత ధోరణి అవలంభిస్తోందంటూ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. తమకు పాత జీతాలు రాకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.
Recommended Video
మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు.. ఇళ్లపై దాడులు
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్పీ ద్వారా ఉద్యోగుల పొట్టకొట్టాలని చూస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మమ్మల్ని ఏమైనా చేసే అవకాశం ఉందంటూ ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఇళ్లపై దాడులు చేయొచ్చు.. మమ్మల్ని అరెస్టులు చేయించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తాము భయపడేది లేదని తేల్చిచెప్పారు. సమ్మె చేయడం తమ హక్కు.. దీనిపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులకు అన్నీ సమస్యలే
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని బండి శ్రీనివాసరావు అన్నారు. వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందని పేర్కొన్నారు. తమకు పీఆర్సీ ఒక్కటే సమస్య. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు అన్నీ సమస్యలేనని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ సర్కార్ తమకు ఇచ్చేది రివర్స్ పీఆర్సీ అని దుయ్యబట్టారు. 14.29 శాతం ఫిట్మెంట్ను ఏ పీఆర్సీ ప్రకారం ఇస్తున్నారో చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
జీతాలు రాకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర
ప్రభుత్వ ఉద్యోగులంతా ఉద్యమంలో ఉండగా.. జగన్ సర్కార్ కొత్త జిల్లాలను తెరపైకి తెచ్చిందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వ్యాఖ్యానించారు. ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు మినహా ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్నారు.. సమ్మెకు సిద్ధమవుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ఉద్యోగులు చేయగలిగినంత పని చేస్తామని చెప్పారు. కానీ ఉద్యోగులుపై మాత్రం అధికారులు ఒత్తిడి తీసుకురావద్దని బాప్పరాజు సూచించారు. ఈనెల జీతాలు రాకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. జీతాలు రాకుంటే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిచాల్సి ఉంటుందని హెచ్చరించారు.