రోజా అలా చేస్తే కాళ్లు పట్టుకుంటా, కేసులు పెట్టుకోవచ్చు: వైసీపీకి బండ్ల గణేష్!
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ల మధ్య ఇటీవల ఓ టీవీ ఛానల్ లైవ్లో వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఒకరిపై మరొకరు రాయలేని, చెప్పలేని స్థితిలో విమర్శలు గుప్పించుకున్నారు.
మీ తండ్రి సచిన్ కాళ్లు పట్టుకున్నది మర్చిపోయారా?: బండ్ల గణేష్ అరెస్టుకు వైసీపీ డిమాండ్
రోజా ఒక మాట అంటే బండ్ల గణేష్ మరో మాట అన్నారు. వారి మధ్య వాగ్వాదం చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. మాటలు శృతి మించాయి. లైవ్లో తిట్టుకోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
క్షమాపణ చెబుతారా అంటే
అదే ఛానల్లో బండ్ల గణేష్ను ఈ విషయమై వివరణ కోరుతూ.. రోజా ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారని, అలాంటి నాయకురాలిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై ఆమెకు క్షమాపణ చెబుతారా అని ప్రశ్నించారు. దీనికి బండ్ల గణేష్ స్పందించారు. అసలు తాను క్షమాపణ ఎందుకు చెప్పాలని అడిగారు.
రోజానే ముందు అన్నారు
తాను క్షమాపణ ఎందుకు చెప్పాలని, అందులో తన తప్పు ఏమీ లేదని బండ్ల గణేష్ అన్నారు. మొదట రోజా మాట జారారని చెప్పారు. ఆ తర్వాతే తాను అనవలసి వచ్చిందని తెలిపారు. ఆమెనే ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని చెప్పారు.
పవన్కు క్షమాపణ చెబితే కాళ్లు పట్టుకుంటా
పవన్ కళ్యాణ్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకు మొదట రోజా క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాత నేను ఆవిడ కాళ్లు పట్టుకొని మరీ క్షమాపణ చెబుతానని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. లేదంటే తాను క్షమాపణ చెప్పాల్సినంత తప్పు చేయలేదన్నారు.
కేసులు వేసుకోవచ్చు
అవసరమైతే తనపై కేసులు వేసుకోవచ్చునని బండ్ల గణేష్ చెప్పారు. తమ మధ్య జరిగిన వివాదాన్ని అందరూ ప్రత్యక్షంగా చూశారని, అందులో తన తప్పు ఎంతుందో, రోజా తప్పు అంతే ఉందని చెప్పారు. తాను చాలా గౌరవంగా అమ్మా అంటూ మాట్లాడానని చెప్పారు.
రోజానే ఆవేశపడ్డారు
రోజా తొలుత ఆవేశంలో మాట జారారు అని బండ్ల గణేష్ చెప్పారు. ఆ తర్వాత అదే ఆవేశంలో తాను కూడా నోరు జారానని చెప్పారు. ఇందులో తన ఒక్కడి తప్పేం లేదని, తొలుత తప్పు చేసింది ఆమెనే అని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ను అరెస్టు చేయాలంటూ వైసీపీ మహిళా నేతలు విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్.. రోజా తగ్గితే తాను తగ్గుతానని చెప్పడం గమనార్హం.