బ్యాంక్ క్యాషియరే...కస్టమర్ల క్యాష్ ,గోల్డ్ తో పరారీ: రూ. కోటి సొత్తు స్వాధీనం
కడప:కంచే చేను మేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటిదే మరో ఉదంతం కడపలో చోటుచేసుకుంది. కస్టమర్లే దేవుల్లంటూ కంటికి రెప్పలా కాపాడాల్సిన ఖాతాదారుల సొమ్ముకే కన్నం వేసాడో బ్యాంకు ఉద్యోగి.
అంతాయింతా కాదు ఏకంగా కోటికి పైగా విలువచేసే బంగారం, సొత్తు తీసుకొని బ్యాంకు నుంచి ఉడాయించాడు. అయితే ఈ ఘటన జరిగి మూడు నెలలు గడుస్తుండగా ఎట్టకేలకు పోలీసులు ఈ కేటుగాడిని అరెస్ట్ చేయగలిగారు. ఈ ఘరానా దొంగ నుంచి మొత్తం సొమ్ము రికవరీ చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో పోలీసులు నిందితుడి వివరాలు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం... కడప జిల్లా పొరుమామిళ్లలోని రంగసముద్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో హెడ్ క్యాషియర్గా పనిచేస్తున్న గురుమోహన్రెడ్డి తాను పనిచేస్తున్న బ్యాంకుకే భారీ కన్నం వేశాడు. బ్యాంకులో ఖాతాదారులు కుదవపెట్టిన నగలతో పాటు బ్యాంకులోని సొమ్ము తీసుకొని ఉడాయించాడు. గత మార్చి నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ కేటుగాడిని పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం పోలీసులు గురుమోహన్రెడ్డిని, అతడికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 56 లక్షల రూపాయల నగదు, 1.7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తాను నష్టపోయానని, అందుకే బ్యాంకు సొమ్ముతో ఉడాయించానని నిందితుడు గురుమోహన్ తమ విచారణలో వెల్లడించినట్టు వైఎస్సార్ జిల్లా ఎస్పీ అట్టడా బాబూజీ తెలిపారు.