అప్పు తీర్చలేదు: సబ్బం హరి ఆస్తుల జప్తునకు బ్యాంక్ నోటీసులు, మాజీ ఎంపీ ఏమన్నాంటే..?
విశాఖపట్నం: అనకాపల్లి మాపీ ఎంపీ సబ్బం హరి ఆస్తుల స్వాధీనానికి విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం వడ్డీ, ఇతర ఖర్చులతో కలిపి రూ.9.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాయిదాలు చెల్లించకపోవడంతో ఎన్పీఏ జాబితాలో చేర్చిన బ్యాంకు ఆర్బీఐ నిబంధనల మేరకు మంగళవారం ఆస్తులు స్వాధీనానికి నోటీలు ఇచ్చింది.
డబ్బా ఆపండి! అవార్డు బాబుకు ఒక్కరికే వచ్చిందా?: ఐటీ దాడులపై జీవీఎల్ ఏమన్నారంటే?
ఆ ఆస్తుల స్వాధీనానికి నోటీసులు
బకాయిలను 60రోజుల్లోగా చెల్లించకపోతే సీతమ్మధారలోని 1622 చదరపు గజాల స్థలంలోని నివాసంతోపాటు మాధవధారలోని వుడాలేఅవుట్లో 444.44 చదరపు అడుగుల విస్తీర్ణంలోని విష్ణు వైభవం అపార్ట్మెంట్, విశాఖ బీచ్ రోడ్లోని రుషికొండ దగ్గరలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుంటామని నోటీసుల్లో స్పష్టం చేసింది.
డీసీ భవనం వేలం పాల్గొని.. 17.80కోట్లకు
విశాఖ నడిబొడ్డున మద్దిలపాలెంలో ఉన్న డెక్కన్ క్రానికల్ భవనాన్ని 2014లో కొటక్ మహేంద్ర వేలం వేసింది. ఆ వేలంలో రూ.17.80కోట్లకు సబ్బం హరి వేలం పాటపాడారు. ఆ సమయంలో తన ఆస్తులను తనఖా పెట్టి విశాఖ కో- ఆపరేటివ్ బ్యాంక్ నుంచి రూ.8.50కోట్ల రుణం తీసుకున్నారు.
వేలం రద్దు చేయాలంటూ డీసీ..
అయితే, వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదంటూ డెక్కన్ క్రానికల్ యాజమాన్య డెబిట్ రికవరీ అపిలేట్ అథారిటీ(డీఆర్ఏపీ)లో కేసు ఫైల్ చేసింది. అపిలేట్ అథారిటీ డెక్కన్ క్రానికల్ వాదనను సమర్థిస్తూ వేలం రద్దు చేయాలని, సబ్బం హరి డిపాజిట్ చేసిన రూ.17.80కోట్లను వడ్డీ సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై కోటక్ మహేంద్ర అప్పీల్కు వెళ్లింది. కాగా, ఈ కేసును జాతీయ స్థాయిలో ఏర్పాటైన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఏసీఎల్టీ)కి రిఫర్ చేశారు. దీనిపై తుది తీర్పు రావాల్సి ఉంది.
బకాయిలు వసూలు కాకపోవడంతోనే నోటీసులు
అయితే, బకాయిలు వసూలు కాకపోవడం వల్లే సబ్బంహరి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఉపక్రమించామని విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ మానం ఆంజనేయులు తెలిపారు. తుది తీర్పు వెలువడగానే సబ్బం హరి రుణాన్ని వడ్డీతో సహా సెటిల్ చేస్తామని కోటక్ మహేంద్ర లిఖిత పూర్వకంగా హామి ఇవ్వడంతో ఇన్నాళ్లు ఎదురుచూశామని చెప్పారు. అయితే, తుది తీర్పు ఎప్పుడొస్తుందో తెలియడం లేదని, అందుకే నోటీసులు జారీ చేశామని చెప్పారు.
బకాయి చెల్లింపుల అనుమానించాల్సిందేం లేదు..
ఈ వ్యవహారంపై సబ్బంహరి స్పందించారు. రూ.60కోట్ల ఆస్తులను కొలాట్రల్ సెక్యూరిటీ పెట్టి కో-ఆపరేటివ్ బ్యాంక్లో రూ.8.50కోట్ల రుణం తీసుకున్నట్లు, రూ. 1.50కోట్ల వరకు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. వడ్డీ సహా రూ.9.54కోట్లు చెల్లించాలని బ్యాంకు నోటీసు ఇచ్చిందని చెప్పారు. డెక్కన్ క్రానికల్ కేసులో తుది తీర్పు వెలువడగానే బ్యాంకు వాళ్లకు చెల్లించాల్సిన బకాయిలను వడ్డీ సహా కోటక్ మహేంద్రాయే నేరుగా చెల్లిస్తుందని తెలిపారు. ఈ రుణ బకాయిల చెల్లింపు విషయంలో సందేహం పడాల్సిన పనిలేదని సబ్బంహరి తెలిపారు.