తెల్లారితే పెళ్ళి, సేవింగ్స్ ఖాతాలోని డబ్బును అప్పుకింద జమ చేసిన బ్యాంకు అధికారులు
వివాహం కోసం దాచుకొన్న నగదును అప్పుకింద జమ చేసుకొన్నారు స్టేట్ బ్యాంకు అధికారులు. ఈ ఘటన అనంతపురం జిల్లా శింగనమలలో చోటుచేసుకొంది.
అనంతపురం :వివాహం కోసం దాచుకొన్న నగదును అప్పుకింద జమ చేసుకొన్నారు బ్యాంకు అధికారులు. అసలే చేతిలో డబ్బులేదు. తెల్లారితే పెళ్ళి, బ్యాంకులో ఉన్న కొద్దిపాటి నగదు కూడ అప్పు కింద జమ చేసుకొంటే ఏంచేయాలని పెళ్ళి కూతురు ఆవేదన చెందుతోంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని శింగనమలలోని స్టేట్ బ్యాంకులో చోటుచేసుకొంది.
అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని దాచేపల్లికి చెందిన శోభారాణి అనే యువతికి డిసెంబర్ 9వ, తేదిన కడపలో వివాహం జరగాల్సి ఉంది. అయితే ఆమె తన ఖాతాలో 6 వేల రూపాయాలను, తన తమ్ముడి ఖాతాలో 6 వేల రూపాయాలను జమ చేశారు.
వివాహం సందర్భంగా ఈ నగదును తీసుకొనేందుకు బ్యాంకుకు వచ్చిన ఆమెకు నిరాశే ఎదురైంది. ఆమె తండ్రి బ్యాంకు నుండి తీసుకొన్న అప్పు కిందకు ఈ నగదును జమ చేసుకొన్నారని బ్యాంకు అధికారులు ఆమెకు చెప్పారు.
వివాహం కోసం ఈ డబ్బును దాచుకొన్నామని, ఈ నగదు తమకు అత్యంత అవసరమని ఆ యువతి బ్యాంకు అధికారులను వేడుకొంది. అయినా వారు మాత్రం కనికరించలేదు..ఇదే కుటుంబానికి చెందిన వారు అప్పులు తీసుకొన్నందున ఈ డబ్బును జమ చేసుకొన్నామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.ఆ యువతి బ్యాంకులో కన్నీళ్ళు పెట్టడంతో ఆమె కొంత నగదును ఇచ్చేందుకు అంగీకరించారు.