మల్కాజిగిరి: పవన్ కళ్యాణ్ టిడిపి వైపు తిప్పేశారా!?
హైదరాబాద్: మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం మొదటి నుండి అందర్నీ బాగా ఆకర్షించుతోంది. జయప్రకాశ్ నారాయణ పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకోవడం తెలుగుదేశం పార్టీలో నూతనోత్తేజాన్ని నింపింది. ఈ నియోజకవర్గంలో మేథావులైన జెపి, నాగేశ్వర రావులతో మాజీ డిజిపి దినేష్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. ఇక ఆయా ప్రధాన పార్టీల నుండి కీలక నేతలు బరిలో నిలిచారు.
మొత్తం 30 మంది బరిలో ఉన్నారు. టిడిపి నుండి సిహెచ్ మల్లారెడ్డి, కాంగ్రెస్ నుండి సర్వే సత్యనారాయణ, తెరాస నుండి మైనంపల్లి హన్మంత రావుయం పోటీ చేస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఓటర్లు ఎవరి వైపుకు ఉన్నారనే విషయమై రోజుకో రకమైన వాదన వినిపిస్తోంది. జెపి గెలుపు ఖాయమని నిన్నటి వరకు అందరూ భావించారు. తెరాస, కాంగ్రెసు పార్టీలు కూడా గట్టి పోటీ ఇస్తాయని అభిప్రాయపడ్డారు.
తాజాగ తెరాస నేతల ఆస్తుల వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పరిస్థితులు తారుమారు అవుతున్నాయట. అలాగే పవన్ కళ్యాణ్ ప్రకటన జెపి పైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదంటున్నారు. ఓటర్లు ఇప్పుడు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ చెబుతోంది. పోటీలో పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం టిడిపి అభ్యర్ధి మల్లారెడ్డి, జెపి, దినేష్ రెడ్డి, సర్వే, మైనంపల్లి మధ్యనే ఉండనుంది.
ఐదుగురిలో నలుగురు గతంలో వివిధ హోదాల్లో ఎమ్మెల్యేలుగానో, ఎంపిలుగానో పని చేసినవారే. దాంతో కొత్తగా బరిలోకి దిగిన వారి పట్లే ప్రజలు మొగ్గు చూపుతున్నారట. కొత్తగా పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్ధులు ఇద్దరు మాత్రమే ఉన్నారు.
వారిలో ఒకరు మల్లారెడ్డి కాగా, మరొకరు దినేష్ రెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి సిఎంఆర్ విద్యాసంస్థలను నిర్వహిస్తుండగా, దినేష్ రెడ్డి డిజిపిగా పని చేశారు. ఇరువురి పని తీరును గమనిస్తూ.. అంతిమంగా మల్లారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారట. జెపికి మల్కాజిగిరిలో ప్రచారం చేస్తారనుకున్న పవన్... ఇటీవల పొత్తు ధర్మంలో భాగంగా తన మద్దతు మల్లారెడ్డికే అని చెప్పడం కూడా కలిసి వచ్చిందంటున్నారు. అయితే, తమదే గెలుపని, సినిమా వాళ్లు చెప్పినంత మాత్రాన ఇప్పుడు ఓటర్లు వినే పరిస్థితి లేదని విపక్షాలు అంటున్నాయి.