బాబుపై భగ్గుమన్న బీసీ సంఘాలు: 'కాపు'లకు రిజర్వేషన్లపై వ్యతిరేకత..
కాకినాడ: కాపులను బీసీల్లో చేర్చడంపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకిస్తూ పలు బీసీ సంఘాలు రాష్ట్రంలో ఆందోళనకు దిగాయి.
కాపు రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం: బాబు ఏమన్నారంటే..?, ఎస్టీల్లోకి బోయ, వాల్మీకి
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ ఎదుట సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను సంఘాలు దగ్ధం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర కోపోద్రిక్తులైన బీసీలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. టైర్లకు నిప్పంటించి రోడ్డుపై వేయడంతో కలెక్టరేట్ వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ప్రభుత్వ నిర్ణయం బీసీలకు నష్టం చేకూర్చేలా ఉందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీసీల మెరుపు ధర్నాతో కలెక్టరేట్ అట్టుడికింది.
బీసీలకు నష్టం జరగదు: కేఈ
కాపులను బీసీ-ఫ్ కేటగిరీలో చేరుస్తూ 5శాతం రిజర్వేషన్లు కల్పించినంత మాత్రాన బీసీల ప్రయోజనాలు దెబ్బతినవని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టంచేశారు.ప్రస్తుతం బీసీలకు కొనసాగుతున్న రిజర్వేషన్ లో ఎలాంటి మార్పు ఉండదన్నారు.
షెడ్యూల్-9లో కాపులకు అదనంగా 5శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు. కాపు రిజర్వేషన్ విద్య, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకే మాత్రమే పరిమితమవుతుందని పేర్కొన్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చడాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.