వైసీపీ బీసీ కార్పోరేషన్లు వర్సెస్ టీడీపీ బీసీ పదవులు- ఓటు బ్యాంకు టర్న్ అయ్యేనా ?
ఏపీలో దాదాపు 50 శాతం జనాభా కలిగిన బీసీలే అండగా ఆవిర్భవించిన టీడీపీ నాలుగు దశాబ్దలుగా వారిని నమ్ముకునే రాజకీయాలు చేస్తోంది. చరిత్రలో తొలిసారిగా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు వైసీపీ వైపు మొగ్గుచూపారు. బీసీలకు వైసీపీ ప్రకటించిన తాయిలాలు అలాంటివి. అప్పటివరకూ బీసీలకు అరకొర పదవులో, కుల వృత్తులు చేసుకునేందుకు పనిముట్లకే పరిమితమైన వ్యవహారం నుంచి ఎన్నికల్లో అత్యధిక శాతం సీట్లను ఇచ్చింది వైసీపీ. ప్రతీ కులానికీ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామనే హామీ ఇచ్చింది. అన్నట్లుగానే దాన్ని నిలబెట్టుకుంది. దీంతో ఇప్పుడు టీడీపీ మరోసారి ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. దీని ప్రభావంతో కాపుల చేతిలో ఉన్న టీడీపీ అధ్యక్ష పగ్గాలను అచ్చెన్నాయుడు రూపంలో బీసీలకు కట్టబెట్టింది. అయితే వైసీపీ, టీడీపీ తాయిలాల ప్రకటన బీసీలను ఎటువైపు మొగ్గేలా చేస్తాయన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఏపీకి అచ్చెన్న, తెలంగాణకు రమణ- కీలక మార్పులతో టీడీపీ కొత్త కమిటీలు..
టీడీపీ అంటే బీసీ పార్టీగా గుర్తింపు..
రాష్ట్ర జనాభాలో కేవలం నాలుగైదు శాతం ఉన్న తమ సామాజిక వర్గం కోసం పార్టీ పెట్టినా అంతిమంగా దాన్నికి కాపు కాయాల్సింది మిగతా కులాలే. ఈ సూత్రం వైసీపీ, టీడీపీ ఇద్దరికీ వర్తిస్తుంది. సరిగ్గా ఇదే కోణంలో 1983లో బీసీల అండతో కమ్మ సామాజిక వర్గ నాయకత్వంలో టీడీపీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి కమ్మ సామాజిక వర్గ నేతలే, ఇంకా చెప్పాలంటే ఓ కుటుంబమే టీడీపీకి నాయకత్వం వహిస్తూ వచ్చింది. అయినా పార్టీకి అండగా నిలిచిన బీసీలు మాత్రం ఎటూ పోలేదు. దీంతో బీసీల అండతోనే పలుమార్లు అధికారం అందుకున్న టీడీపీ రాష్ట్ర విభజన తర్వాత మాత్రం బీసీలను నిర్లక్ష్యం చేసిందన్న అపవాదు మూటగట్టుకుంది. దీంతో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి బీసీలు దూరమయ్యారు. దీని ప్రభావం ఏ స్ధాయిలో పడిందంటే టీడీపీ కేవలం 23 స్ధానాలకే పరిమితమైంది.
వైసీపీకి తొలిసారి బీసీల అండ...
ఏపీలో బీసీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న జిల్లాల్లో అనంతపురంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు ఉంటాయి. వీటిలో భారీ స్ధాయిలో ఉన్న బీసీలు ఎటువైపు మొగ్గితే వారికే రాష్ట్రంలో అధికార పీఠం దక్కుతోంది. దీంతో అనంతపురంలోని రెండు పార్లమెంటు సీట్లతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల బీసీ సమీకరణాలను వైసీపీ గత ఎన్నికల్లో సమర్ధవంతంగా వర్కవుట్ చేసింది. దీంతో ఆయా స్ధానాల్లో బీసీలు వర్సెస్ కమ్మ సామాజికవర్గంగా సైతం మారిపోయింది. గత ప్రభుత్వంలో బీసీలను టీడీపీ నాయకత్వం చిన్నచూపు చూసిందంటూ వైసీపీ చేసిన ప్రచారం వారిలో పెను ప్రభావం చూపింది. ఫలితంగా బీసీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ వైపు మొగ్గారు. దీంతో వైసీపీ కూడా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికార పీఠం అందుకుంది.
బీసీ కార్పోరేషన్ల ప్రకటనతో డిఫెన్స్లో టీడీపీ...
వైసీపీ ప్రభుత్వం గతంలో తాము ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు బీసీల్లోని 135 కులాలకు 56 కార్పోరేషన్లను ప్రకటించింది. వీటి ద్వారా బీసీల్లోని అన్ని కులాలకు ఏదో ఒక కార్పోరేషన్లో ప్రాతినిధ్యం దక్కినట్లయింది. భవిష్యత్తులో వాటికి నిధులు ఇస్తారా, అవి ఎలా పనిచేస్తాయి, బీసీలకు పనికొస్తాయా లేదా అన్న చర్చను పక్కబెడితే ప్రతీ బీసీ కులం కోసం కార్పోరేషన్ ప్రకటించడం ద్వారా వారికిచ్చిన హామీని నిలబెట్టుకున్నామని వైసీపీ చెప్పుకోవడానికి ఈ నిర్ణయం వీలు కల్పించింది. అదే సమయంలో వైసీపీ నిర్ణయం టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. పైకి వైసీపీపై ఎన్ని విమర్శలు చేస్తున్నా లోలోపల బీసీలకు జగన్ ప్రకటిస్తున్న వరాలు టీడీపీని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో దీనికి ఇవ్వదగిన అతి పెద్ద కౌంటర్ ను టీడీపీ గత నెలలోనే సిద్ధం చేసి పెట్టుకుంది.
బీసీ పదవులతో టీడీపీ కౌంటర్..
వైసీపీ ప్రభుత్వం ఏదో ఒక రోజు బీసీ కార్పోరేషన్లను ప్రకటిస్తుందన్న పక్కా సమాచారంతో టీడీపీ కొన్ని నెలల క్రితమే అప్రమత్తమైంది. ఎలాగో గత ఎన్నికల్లో ఓటమి పాలైన కాపు నేత కళా వెంకట్రావు స్ధానంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీసీ నేత అయిన అచ్చెన్నాయుడుకు పగ్గాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. అయితే అది ఎప్పుడన్నది మాత్రం సస్పెన్స్లా ఉంచారు. వైసీపీ బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయగానే, తాము ఏపీలో పార్టీ పగ్గాలనే బీసీ నేతకు ఇచ్చామని చెప్పుకునేలా అచ్చెన్నాయుడు పేరు ప్రకటించారు. ఆయనతో పాటు పార్టీ కమిటీల్లో బీద రవిచంద్ర, యనమల, కేఈ కృష్ణమూర్తి, రామ్మోహన్ నాయుడు వంటి వారికి అవకాశాలు కల్పించారు. తద్వారా తమది బీసీ పార్టీ అని చెప్పుకునేలా చంద్రబాబు ప్లాన్ చేశారు.
బీసీ వర్గాల చూపు ఎటు ?
గతంలో తమను ఓటు బ్యాంకుగా చేసుకుని దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవించిన టీడీపీ పదవుల విషయానికొచ్చే సరికి అరకొరగానే ఇచ్చిందనే అసంతృప్తి వారిలో ఉంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేకించి బీసీ వర్గాలను టీడీపీ అధినేత చంద్రబాబే ఈసడించుకున్నారనే ప్రచారం ఉండనే ఉంది. ఇప్పుడు వైసీపీ ప్రకటించిన ప్రత్యేక కార్పోరేషన్లతో తమకు ఇచ్చిన అతిపెద్ద హామీ నిలబెట్టుకున్నట్లయింది. టీడీపీ కేవలం పార్టీలో ఉన్న సీనియర్లకే బీసీల పేరుతో పదవులు కట్టబెట్టగా.. ఇప్పుడు వైసీపీ ప్రకటించిన కుల కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల రూపంలో వందల మంది బీసీలకు పదవులు దక్కాయి. ఇందులో ఇప్పటివరకూ రాజకీయాధికారం అనుభవించని ఎన్నో వర్గాలున్నాయి. దీంతో రాష్ట్రంలో బీసీల మొగ్గు వైసీపీవైపే కనిపిస్తోంది. భవిష్యత్తులో ఏదైనా అద్బుతాలు జరిగితే తప్ప టీడీపీని బీసీలు వీడిపోయినట్లేననే వాదన వినిపిస్తోంది.