కోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టులాంటిది.. బీసీలను చంద్రబాబు మోసం చేస్తున్నారు: పోలీస్ మాధవ్
హిందూపురం: తన నామినేషన్ను అడ్డుకునేందుకు మంత్రి పరిటాల సునీత, జేసీ దివాకర్ రెడ్డిలు విశ్వప్రయత్నం చేశారని హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. న్యాయం కోసం హైకోర్టును తాను ఆశ్రయించినట్లు చెప్పిన మాధవ్... కోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టులాంటిదని అన్నారు. తన వీఆర్ఎస్ ఆమోదం పొందకుండా చాలా ప్రయత్నాలే తెరచాటున జరిగాయని మాధవ్ ఆరోపించారు. ఇక వెనకడిన వర్గాలకు టీడీపీ వ్యతిరేకం అన్న మాధవ్... వారి ఎదుగుదలను సీఎం చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
బీసీలకు కేవలం జగన్ మాత్రమే న్యాయం చేయగలరని... చంద్రబాబు చేస్తున్న మోసాలపై బీసీలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో తాను చేస్తున్న పోలీస్ ఉద్యోగానికి వీఆర్ఎస్ పెట్టుకున్నారు మాధవ్. అయితే తన ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఇక నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండటంతో మాధవ్ ప్రభుత్వం తన రాజీనామాను ఆమోదించడం లేదని ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలని ట్రిబ్యునల్ ఆదేశించినప్పటికీ ప్రభుత్వం లెక్క చేయలేదని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివరి నిమిషంలో మాధవ్ భార్యకు వైసీపీ బీఫాం ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాను హైకోర్టును ఆశ్రయించారు మాధవ్. దీంతో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
హైకోర్టు తీర్పు మాధవ్కు అనుకూలంగా రావడంతో వెంటనే రాజీనామా ఆమోదించాలని జిల్లా ఎస్పీకి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంతో మాధవ్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో పోలీస్ మాధవ్, ఆయన భార్య సవితలు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.