మహిళలకు 50 శాతం: ఔట్ సోర్సింగ్ నియామకాలపై ఏపీ సర్కార్: స్వయంగా సీఎం పర్యవేక్షణలో..
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించే ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధి, విధానాలతో కూడిన ప్రతిపాదనలపై ఆయన ఆమోదం తెలిపారు. దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆయన అదేశించారు. ఈ కార్పొరేషన్ కార్యకలాపాలన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) పర్యవేక్షణలో కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.
ఔట్ సోర్సింగ్ లో రిజర్వేషన్ల కోసం..
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వరంగ సంస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమిస్తుంటారు. ఉమ్మడి రాష్ట్ర నుంచీ ఈ విధానంలో అమల్లోకి వస్తోంది. శాశ్వత ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తరువాత.. వారి ఖాళీలను ఔట్ సోర్సింగ్ ద్వారా అప్పటికప్పుడు భర్తీ చేయడానికి ఉద్దేశించిన విధానం ఇది. వేతనాలు తక్కువే అయినప్పటికీ.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారు విధులను నిర్వర్తిస్తుంటారు. అలాంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలనే డిమాండ్ ఈనాటిది కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ డిమాండ్ వినిపించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
మహిళలకు 50 శాతం తప్పనిసరి..
ఈ డిమాండ్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లను కల్పించాలని, ఇందులో 50 శాతం మహిళలతో భర్తీ చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే అన్ని స్థాయిల ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కల్పించే ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లను తప్పనిసరి చేశారు. సగం మంది మహిళలను తీసుకోవాల్సి ఉంటుంది.
డిసెంబర్ 1 నుంచి కార్పొరేషన్..
వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ కార్పొరేషన్ కార్యకలాపాలను ఆరంభిస్తుంది. రాష్ట్రస్థాయిలో ఈ కార్పొరేషన్ కార్యకలాపాలను ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. జిల్లా స్థాయిలో ఆయా జిల్లాల ఇన్ ఛార్జి మంత్రులు ఈ కార్పొరేషన్ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. జిల్లా కలెక్టర్ ఎక్స్ అఫీషియోగా వ్యవహరిస్తారు. ఈ నెల 16న వెలగపూడి సచివాలయంలో ఏర్పాటయ్యే మంత్రివర్గ సమావేశంలో ఔట్ సోర్సింగ్పై స్పష్టమైన విధానంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే సూచనప్రాయంగా చేసిన విధి విధానాల ఆధారంగా.. దాన్ని మరింత సరళీకరించడంతో పాటు మంత్రివర్గ సమావేశంలో వచ్చే సూచనలు, సలహాల ఆధారంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించే అవకాశాలు ఉన్నాయి.