తమాషాలా.. జాగ్రత్తగా ఉండండి: టీడీపీ ఎంపీలకు బాబు క్లాస్
Recommended Video
ఏపీలో ఓ వైపు ఉక్కు ఫ్యాక్టరీ సాధనకోసం దీక్షలు జరుగుతుంటే మరోవైపు టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ఛలోక్తులు విసురకుంటూ హాయిగా నవ్వుకుంటున్న వీడియో లీకై రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎంపీల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వెళ్లిన పనేమిటి అక్కడ చేస్తున్నదేమిటని ఎంపీలను ప్రశ్నించారు. ఓ వైపు సీఎం రమేష్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తుంటే మీకు వెటకారంగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటివి రిపీట్ చేయొద్దని ఎంపీలకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే వారు మాట్లాడుతున్న మాటలను ఎవరో ఎడిట్ చేశారని... వారికి కావాల్సిన మాటలనే కట్ చేసుకున్నారని ఎంపీ మురళీ మోహన్ అన్నారు. మరోవైపు తమ మాటలను కట్ అండ్ పేస్ట్ చేశారని మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. వీడియో లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో జరిగే దీక్షలపై టీడీపీ ఎంపీల బృందం వెటకారపు వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీక్షలు కేవలం బరువు తగ్గేందుకే అన్న అర్థం వచ్చేలా ఎంపీలు మాట్లాడటం వీడియోలో చాలా స్పష్టంగా వినిపించింది. ఎంపీలు చేసిన ఈ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చిచ్చు పెడుతోంది. అంతే కాదు ఈ వ్యాఖ్యలు చేసి ప్రజల్లో కూడా ఈ నేతలు చాలా చులకనయ్యారు.
ఏపీకి రావాల్సిన వాటికోసం ఢిల్లీలో పోరడతాం అని బీరాలు పలికిన నేతలు అక్కడ కపట నాటకాలు ఆడుతున్నారనేందుకు బయటపడ్డ వీడియోనే నిదర్శనమని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. దీంతో ఎంపీలు చేస్తున్న దీక్షలు బూటకమని తేలిపోయిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఏపీ భవన్ సాక్షిగా ఈ ఉదంతం జరిగింది. ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్నానని అందుకు ఒక వారం రోజులు దీక్ష చేసేందుకు తాను సిద్ధమేనని ఎంపీ మురళీ మోహన్ అన్నారు. అంతలోనే కల్పించుకున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈయన్ను పెడదాం...డన్ అన్నారు. జోనూ లేదు గీనూ లేదు అని మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు.