'ఈ దెబ్బకు చంద్రబాబుకు మళ్లీ అదే భవిష్యత్తు, వచ్చే ఎన్నికల్లో రెండే సీట్లు'
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహిళా కార్యకర్తల పట్ల ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు అన్నారు.
చదవండి: తెరపైకి అల్లుడు: నంద్యాలపై ఎస్పీవై రెడ్డి కొత్త ట్విస్ట్, అఖిలప్రియకు చంద్రబాబు షాకిస్తారా?
వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు అలా ప్రవర్తిస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిని చిన్నదిగా చూపే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్ఏఐ దర్యాఫ్తుకు టీడీపీ ఎందుకు భయపడుతోందో చెప్పాలన్నారు.
ఓ తెలుగు రాష్ట్ర ప్రజలు ఛీకొట్టారు
తెలుగుదేశం పార్టీ అడ్రస్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమని జీవీఎల్ అన్నారు. ఇందులో ఓ తెలుగు రాష్ట్రం (తెలంగాణ) పూర్తిగా ఛీకొట్టిందని చెప్పారు. ఇక ఏపీలోను అదే జరగబోతోందని జోస్యం చెప్పారు. ఈ ఒత్తిడితోనే కాకినాడలో బీజేపీ మహిళా నాయకుల పట్ల చంద్రబాబు అలా ప్రవర్తించారని చెప్పారు. మహిళల పట్ల, ఇతర రాజకీయ పట్ల తమకు ఎలాంటి సహనం లేదని ఆయన చెప్పకనే చెప్పారన్నారు. ఇలాంటి పరిణామాలతో టీడీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందుకు టీడీపీ సిద్ధంగా ఉండాలన్నారు.
ఏపీలో టీడీపీకి రెండే సీట్లు
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని జీవీఎల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. తెలంగాణలో ప్రజాకూటమి ఓటమి తర్వాత చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందన్నారు.
చంద్రబాబుకు భవిష్యత్తులో మళ్లీ అదే
ఏపీలోని ప్రజలంతా తమ వెంటే ఉన్నట్టుగా చంద్రబాబు ఊహించుకోవడం విడ్డూరంగా ఉందని, చిల్లర బిల్డప్స్ ఇవ్వొద్దని జీవీఎల్ అన్నారు. గతంలో అధికారం లేకుండా పదేళ్ల పాటు ఉన్న చంద్రబాబుకు, మళ్లీ అదే భవిష్యత్లో ఆయనకు రాబోతోందన్నారు. శబరిమలలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
చంద్రబాబుకు భయం పట్టుకుంది
జగన్ పైన జరిగిన దాడి ఘటనను తక్కువ చేసి చూపించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. వాస్తవాలు బయటకొస్తే తమ జాతకాలు తారుమారవుతాయని చంద్రబాబు భయపడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. జగన్ పైన జరిగిన దాడి ఘటనను టీడీపీ తక్కువ చేసి చూపించిన తీరు, ఆ పార్టీ కుళ్లుబోతుతనానికి, కక్ష సాధింపు వైఖరికి అద్దంపడుతోందన్నారు. జగన్పై హత్యాయత్నానికి పాల్పడి కుట్ర పన్నిన వారంతా ఈ కేసును ఎన్ఐఏకు బదలాయించడంతో వణికిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా వేరుగా అన్నారు. రాష్ట్రానికి సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు రావొద్దని చెప్పిన చంద్రబాబు తాజాగా ఎన్ఐఏ కూడా రావొద్దని అంటున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేసి జగన్పై హత్యాయత్నం చేయించారన్నారు.