బాబుకు మళ్ళీ దగ్గరౌతున్న హరికృష్ణ: మళ్ళీ రాజ్యసభకు
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... హరికృష్ణకు నామినేట్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. టిడిపి ఛైర్మెన్ పదవిని హరికృష్ణ ఇవ్వాలని తొలుత భావించినా, ఆ పదవిని నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావుకు కేటాయించాలని బాబు యోచిస్తున్నారని సమాచారం. దరిమిలా హరికృష్ణను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది.
నందమూరి కటుంబానికి టిడిపిలో ప్రాధాన్యత తగ్గలేదనే సంకేతాలు ఇచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బాలకృష్ణను బరిలోకి దింపారు.
హరికృష్ణకు చంద్రబాబు బంపర్ ఆఫర్: జూ.ఎన్టీఆర్ కోసమే?
అయితే అప్పటివరకు రాజ్యసభలో టిడిపి తరపున హరికృష్ణ ప్రాతినిథ్యం వహించారు. హరికృష్ణకు రాజ్యసభ పదవిని మరోసారి పొడిగించలేదు. హిందూపురం నుండి బాలకృష్ణకు టిక్కెట్టు కేటాయించారు. అయితే హరికృష్ణను దూరం పెట్టి బాలకృష్ణకు చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం కూడ సాగింది.
అయితే లోకేష్ మంత్రిగా ప్రమాణం చేసే సమయంలో హరికృష్ణ హజరయ్యారు. ఇటీవల జరిగిన పార్టీ పొలిట్బ్యూరో సమావేశానికి కూడ హరికృష్ణ వచ్చారు. రాజ్యసభ సభ్వత్వం కావాలని హరికృష్ణ పార్టీ నాయకత్వానికి సంకేతాలు పంపారు. బాబుకు ఇటీవల కాలంలో హరికృష్ణ దగ్గరౌతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
హరికృష్ణకు రాజ్యసభ సభ్యత్వం
టిడిపి నుండి మరోసారి హరికృష్ణను రాజ్యసభకు పంపాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఈ మేరకు బాబు వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. తొలుత టిటిడి ఛైర్మెన్ పదవిని హరికృష్ణకు ఇవ్వాలని చంద్రబాబునాయుడు భావించారు. టిడిడి ఛైర్మెన్ పదవి కోసం పార్టీలో ఉన్న పోటీ నేపథ్యంలో హరికృష్ణకు ఈ పదవిని ఇవ్వాలని భావించారని సమాచారం. అయితే పార్టీ అవసరాల రీత్యా హరికృష్ణకు కాకుండా మరోకరికి ఈ పదవిని కట్టబెట్టాలనే యోచనలో బాబు ఉన్నారని సమాచారం. అంతేకాదు హరికృష్ణను రాజ్యసభకు పంపడం ద్వారా సముచిత గౌరవం ఇచ్చినట్టు అవుతోందని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
బీద మస్తాన్రావుకు టిటిడి ఛైర్మెన్ పదవి
నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావుకు టిటిడి బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. యాదవ సామాజికవర్గానికి చెందిన మస్తాన్ రావు పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు..యాదవ సామాజిక వర్గానికి ఈ పదవి ఇవ్వడం వల్ల చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న యాదవులను ఆకర్షించవచ్చన్న వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
బిసిలకు పెద్ద పీట వేస్తున్నామనే సంకేతాలు
అన్ని కులాలకు వరాలు ప్రకటించిన బాబు.. పార్టీకి పునాదిరాళ్లయిన బీసీలను ఆకర్షించేందుకు బిసి సామాజిక వర్గానికి చెందిన మస్తాన్రావుకు కీలకమైన టిటిడి చైర్మన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ పదవిని తొలుత నందమూరి హరికృష్ణకు ఇవ్వాలని ప్రతిపాదించగా, ఆయన రాజ్యసభ సీటు కోరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఇంకా పదవీకాలం ఉండగానే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆయనకు రాజ్యసభ సీటును ఇచ్చే విషయమై బాబు సానుకూలంగా ఉన్నారని సమాచారం.
నామినేటేడ్ పదవులపై దృష్టి
నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసినందున ఇక పార్టీపై దృష్టి సారించాలని చంద్రబాబు నిర్ణయించారు. మహానాడు ముగిసి నాలుగు నెలలవుతున్నా ఇప్పటివరకూ ఏపి, తెలంగాణ రాష్ట్ర కమిటీలు ప్రకటించలేదు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికలతో బిజీగా ఉన్నందున దానిపై దృష్టి సారించడం సాధ్యపడలేదని, ఇప్పుడు రెండు రాష్ట్ర కమిటీల ఎంపికపై బాబు కసరత్తు ప్రారంభించారని పార్టీ వర్గాలు చెప్పాయి. పార్టీ వర్క్షాప్ జరుగుతున్న సమయంలో తెలంగాణ పార్టీ సీనియర్ నేత ఇనగాల పెద్దిరెడ్డి పార్టీ కమిటీలపై బాబుతో చర్చించారు. ఒకటి, రెండు వారాల్లో రాష్ట్ర కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది.