మందు బాబులకు చేదు వార్త: వేసవిలో పెరిగిన బీరు ధరలు
హైదరాబాద్: వేసవిలో ఓ చల్లని బీరు తాగుదామనుకునే మద్యం ప్రియులకు చేదు వార్త. కారణం, బీరు, ఫారెన్ బ్రాండ్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం మామూలు బీరు ధర రూ. 5, స్ట్రాంగ్ బీరు ధర రూ. 10, ఫారెన్ బ్రాండ్ ధరలు రూ. 100 లకు పైగా పెరగనున్నాయి.
ఈ పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి ముడి సరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయం బాగా పెరిగినందున అందుకు అనుగుణంగా బీర్లపై ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు చాలా కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోబీర్లపై 35శాతం వరకు ధరలు పెంచవచ్చని టెండర్ కమిటీ సిఫారసు చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిఫారసును అంగీకరించలేదు. కానీ చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో పదిశాతం లోపే ధరలను పెంచాలని నిర్ణయించింది.
తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆ సంస్ధ ప్రతినిధులకు, అధికారులకు శనివారం జారీ చేసింది. అంతేకాకుండా తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు కూడా ఎటువంటి కొత్త స్టాక్కు షాపులకు విడుదల చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో మద్యం షాపు యజమానులు తమకిష్టం వచ్చిన ధరలకు మద్యాన్ని అమ్ముతున్నారు.