మండుతున్న ఎండలు: హాట్ కేకుల్లా బీర్ల అమ్మకాలు, వైద్యులేమంటున్నారు?
కృష్ణా: మండుతున్న ఎండలతో విజయవాడలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సుమారు 40 శాతం అధికంగా బీర్ల అమ్మకాలు జరగినట్లు మద్యం షాపుల యజమానులు చెబుతున్నారు. ఎండలు మండిపోతుండటంతో చల్లని బీరు తాగితే ఉపశమనంగా ఉంటుందని భావిస్తున్న కస్టమర్లు అధిక సంఖ్యలో వస్తున్నారని వారు చెబుతున్నారు.
ఉదయం పది గంటలు దాటితే చాలు బారు షాపులకు మందుబాబులు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా, ఎండాకాలంలో చల్లని బీరు తగిలితే హాయిగా ఉంటుందని, వడదెబ్బ తగలదనే అభిప్రాయం తప్పని వైద్యులు అంటున్నారు. బీరు తాగితే కడుపులో చల్లగా ఉంటుందని అనుకోవడం ఒక భ్రమ మాత్రమేనని చెబుతున్నారు.
శరీరాన్ని కూల్ చేయడానికి మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు లాంటివి తాగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సమరం మాట్లాడుతూ.. సమ్మర్లో చల్లని బీరు తాగితే హ్యాపీగా ఉండొచ్చని, వడదెబ్బ బారిన పడకుండా ఉంటామనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.
చల్లని బీరు తాగితే చల్లగా ఉండే బదులు చివరకు ప్రాణం మీదకు వస్తుందన్నారు. ఎండలో చల్లని బీరు మంచిదని బార్ షాపుల వాళ్లు చేసే ప్రచారం తప్పా, అందులో ఎటువంటి వాస్తవం లేదని సమరం తేల్చి చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఎండాకాలంలో మద్యానికి దూరంగా ఉండటమే మంచిదని పలువురు చెబుతున్నారు.