మరికొన్ని గంటల్లోనే పెళ్ళి... వరుడు జంప్, ఏం జరిగిందంటే?
ఏలూరు: కొద్ది గంటల్లోనే వివాహం, వరుడి కోసం పెళ్ళి మండపంలో ఎదురు చూస్తున్నారు. కానీ, అమ్మాయి తరుపు వారికి పెళ్ళి కొడుకు షాకిచ్చారు. వివాహం మండపంలో ఎంతసేపు ఎదురుచూసినా పెళ్ళి కొడుకు రాలేదు. పెళ్ళి కొడుకు కోసం ఆరా తీస్తే వరుడు పారిపోయినట్టు తేలింది. దీంతో వివాహం రద్దయింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.
పెళ్లి చూసి, నూతన దంపతులపై అక్షింతలు వేద్దామని అమ్మాయి తరఫు బంధువులు అంతా వచ్చారు. పెళ్లి మండపంలో అంతా సందడి వాతావరణం నెలకొంది.
మరికాసేపట్లో తమ కూతురు ఓ ఇల్లాలు కాబోతుందని పెళ్లికూతురి తల్లిదండ్రులు ముచ్చటపడుతున్నారు. కానీ, అదే సమయంలో వధువు కుటుంబ సభ్యులకు షాక్ కల్గించే వార్త తెలిసింది.
వరుడు జంప్ అయ్యారని తెలిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాళ్ళపూడి మండలం తిరుగురుమెట్టకు చెందిన వరుడు ఎర్రమాల రాజేష్ పారిపోయాడు. కొన్ని గంటల్లో వివాహం ఉండగానే రాజేష్ పారిపోవడం కలకలం రేపుతోంది.
ఇప్పటికే వరుడి కుటుంబానికి కట్నం కింద రూ.5 లక్షలు చెల్లించారు. వరుడి ఇంటికి వెళ్ళి చూస్తే వరుడు పారిపోయాడని స్థానికులు చెప్పారు. అయితే వరుడు ఎందుకు పారిపోయాడో తెలియదని స్థానికులు చెప్పారు. వరుడు పారిపోవడంతో వివాహం రద్దయింది.