కీలక పరిణామం: రాహుల్తో భేటీకి ముందు విమానాశ్రయంలో ఆజాద్తో చంద్రబాబు భేటీ
న్యూఢిల్లీ/అమరావతి: దేశ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముఖ్య నేతలను కలవడం గమనార్హం. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని చంద్రబాబు గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు కలవనున్నారు.
జాతీయస్థాయిలో కీలకం: రేపు రాహుల్తో బాబు భేటీ? తెలంగాణలో సీట్ల లెక్క కొలిక్కి వచ్చే ఛాన్స్
రాహుల్ గాంధీతో భేటీకి ముందే చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కలుసుకోవడం గమనార్హం. చంద్రబాబు ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే ఆజాద్ను కలిశారు. ఇరువురు నేతలు అక్కడే దాదాపు పదిహేను నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాజకీయంగా కలుస్తున్న కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆజాద్, చంద్రబాబు భేటీ, ఆ తర్వాత కీలక పరిణామం
చంద్రబాబు, గులాం నబీ ఆజాద్లు ఢిల్లీ విమానాశ్రయంలో కలుసుకొని తాజా కేంద్ర రాజకీయాలపై చర్చించారని తెలుస్తోంది. ఆ తర్వాత చంద్రబాబు శరద్ పవార్ ఇంటికి వెళ్తారు. అనంతరం ఫరూక్ అబ్దుల్లాను కలుస్తారు. అనంతరం రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. రాహుల్ గాంధీ, చంద్రబాబులు కలుసుకోవడం ఓ కీలక పరిణామం అని చెప్పవచ్చు.
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో నేతలను ఏకం చేసే ప్రయత్నం
బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ సహా జాతీయస్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రధాని కావాలనో, కూటమికి నాయకత్వం వహించాలనో తాను అనుకోవడం లేదని, ఇది తన కోసం చేస్తున్నది అసలే కాదని, దేశాన్ని రక్షించేందుకు చేస్తోన్న పోరాటమని చంద్రబాబు చెబుతున్నారు.
నాడు ఒకే వేదికపై, నేడు ముఖాముఖి
అంతకుముందు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో రాహుల్ గాంధీ, చంద్రబాబులు ఒక వేదిక పైన కనిపించారు. ఇప్పుడు వారిద్దరు ఎదురెదురుగా భేటీ కానున్నారు. దేశ రాజకీయాలతో పాటు 2019లో ఏపీలో పొత్తు, తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల సీట్ల అంశంపై వారి మధ్య చర్చ జరగనుందని తెలుస్తోంది. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం చంద్రబాబు.. ములాయం సింగ్ యాదవ్ లేదా అఖిలేష్, అజిత్ సింగ్, సీతారాం ఏచూరీ తదితరులతో సమావేశం కానున్నారు.
అంతరాలు తొలగించేందుకు ప్రాధాన్యం
జాతీయస్థాయిలో బీజేపీయేతర పార్టీల మధ్య ఉన్న అంతరాలను తొలగించేందుకు, వారిని ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. గత శనివారం ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులను కలిశారు.